
న్యూఢిల్లీ: ఈ తరం క్రికెట్లో స్లో ఓవర్ రేట్ అనేది కెప్టెన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నిర్ణీత సమయంలోగా ఓవర్ల కోటాను పూర్తి చేయకపోతే ఆయా జట్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నాయి. మ్యాచ్ ఫలితాన్ని కూడా ఈ నిబంధన శాసిస్తోంది. గతంలో స్లో ఓవర్ రేట్కు గురైతే కెప్టెన్ మ్యాచ్ ఫీజులో కోత విధించేవారు. మరోసారి అదే తప్పిదం చేస్తే జట్టులో ఉన్న ఆటగాళ్లందరి మ్యాచ్ ఫీజులోనూ కోత విధించేవారు. కెప్టెన్లపై ఓ మ్యాచ్ నిషేధం కూడా పడేది.
ఇన్ని చర్యలు తీసుకున్నా.. మార్పు రాకపోవడంతో ఐసీసీ ఈ నిబంధనను మరింత కఠినం చేసింది. ఆటగాళ్లు కోట్లు సంపాదిస్తున్న నేపథ్యంలో మ్యాచ్ ఫీజులతో లాభం లేదని భావించిన ఐసీసీ.. కొత్త రూల్ తీసుకొచ్చింది. సాధారణంగా పవర్ ప్లే సమయంలో 30 గజాల సర్కిల్ బయట కేవలం ఇద్దరు మాత్రమే ఉంటారు. పవర్ ప్లే ముగిసిన తర్వాత 5 గురు ఉంటారు. అయితే స్లో ఓవర్ రేట్లో ఈ ఫీల్డింగ్ నిబంధనల్లో ఐసీసీ మార్పులు తెచ్చింది.
ఒక జట్టు నిర్ణీత సమయానికి ఎన్ని ఓవర్లు తక్కువ వేస్తే అన్ని ఓవర్ల పాటు సర్కిల్ బయట ఒక్క ఫీల్డర్ తక్కువగా ఉంచేలా నిబంధనను తీసుకొచ్చాంది. ఉదహారణకు ఓ జట్టు నిర్ణీత సమయం కన్నా రెండు ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేస్తే.. ఆ రెండు ఓవర్ల పాటు 30 యార్డ్ సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు. ఇది మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తోంది. స్లాగ్ ఓవర్లలో ఈ ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్ బ్యాటర్లకు అనుకూలంగా మారుతున్నాయి.
ఈ క్రమంలోనే స్లో ఓవర్ రేట్ నుంచి తప్పించుకునేందుకు ఆస్ట్రేలియా మంచి ఉపాయం చేసింది. బౌండరీకి వెళ్లిన బంతులను ఫీల్డర్లే తీసుకురావడం వల్ల సమయం వృథా అవుతుందని గమనించిన ఆసీస్.. సపోర్ట్ స్టాఫ్, ఎక్స్ట్రా ప్లేయర్లతో బౌండరీ ధాటిన బంతులను త్వరగా అందించేలా వ్యూహం రచించింది. ముఖ్యంగా పవర్ ప్లే సమయంలో ఈ ప్లాన్ బాగా వర్కౌట్ అయ్యింది. పవర్ ప్లేలో సర్కిల్ బయట ఇద్దరే ఫీల్డర్లు ఉన్నప్పుడు.. ఈ ప్లాన్ బాగా పనికొచ్చింది. దాంతో 10-20 సెకండ్ల టైమ్ కలిసొస్తుంది. ఈ వ్యూహాన్ని క్రికెట్ విశ్లేషకులు సైతం మెచ్చుకుంటున్నారు.
స్లో ఓవర్ రేట్ తప్పించుకునేందుకు గుడ్ ఐడియా అని కితాబిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం.. ఈ ప్లాన్ను టీ20 ప్రపంచకప్లో అమలు చేయాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.