
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ ముంగిట టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా హుషారుగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే మెగా టోర్నీ కోసం భారత జట్టుతో ఆస్ట్రేలియా చేరిన విరాట్ కోహ్లీ.. ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. కాన్బెర్రా నుంచి శనివారం బ్రిస్బేన్కు భారత్ జట్టు చేరుకోగా.. విమానాశ్రయంలో విరాట్ కోహ్లీ జోక్లు పేలుస్తూ హాయిగా నవ్వుతూ కనిపించాడు. ఈరోజు బ్రిస్బేన్లో జరిగిన టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో కోహ్లీ డ్యాన్స్ వేస్తున్న వీడియో ఒకటి వైరల్గా మారింది. పాకిస్థాన్తో ఈ నెల 23 మెల్బోర్న్ వేదికగా జరిగే మ్యాచ్తో టీమిండియా తమ ప్రపంచకప్ క్యాంపైన్ ప్రారంభించనుంది.
బ్రిస్బేన్ వేదికగా భారత్ జట్టు షెడ్యూల్ ప్రకారం సోమవారం ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత బుధవారం న్యూజిలాండ్తో కూడా వార్మప్ మ్యాచ్ను ఆడనుంది. ఆస్ట్రేలియా పిచ్లపై వేగంగా అలవాటు పడేందుకు ఈ వార్మప్ మ్యాచ్లను భారత్ జట్టు వినియోగించుకోవాలని ఆశిస్తోంది. అయితే.. కోహ్లీకి ఆస్ట్రేలియాపై మంచి రికార్డ్ ఉంది. కానీ భారత్ జట్టులోని కొంత మంది ఆటగాళ్లకు ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం లేదు. మరీ ముఖ్యంగా.. భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కు ఆస్ట్రేలియా కొత్త. దాంతో వార్మప్ మ్యాచ్లో అతడికి ఎక్కువ ప్రాక్టీస్ లభించేలా టీమిండియా మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తోంది.
విరాట్ కోహ్లీ గత నెల రోజులుగా సూపర్ ఫామ్లో ఉన్నాడు. సెప్టెంబరులో ముగిసిన ఆసియా కప్ 2022లో అఫ్గానిస్థాన్పై సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ.. మూడేళ్ల శతక నిరీక్షణకు తెరదించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాపై కూడా నిలకడగా రాణించాడు. దాంతో.. టీ20 ప్రపంచకప్ 2022లోనూ కోహ్లీ చెలరేగాలని టీమిండియా ఆశిస్తోంది. ఫామ్ అందుకోవడంతో కోహ్లీ కూడా గత నెల రోజుల నుంచి రిలాక్స్గా కనిపిస్తున్నాడు.