
అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బంగ్లాదేశ్ సారథి షకీబ్ అల్ హసన్ మధ్య ఆసక్తికర వాగ్వాదం జరిగింది. నోబాల్ విషయంలో ఈ ఇద్దరూ వాదులాడుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా హసన్ మహ్ముద్ వేసిన 16వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఓవర్ చివరి బంతిని హసన్ మహమూద్ బౌన్సర్ వేయగా.. విరాట్ సింగిల్ తీసి నోబాల్ అని సూచించాడు. అంపైర్ కూడా నోబాల్ ఇవ్వగా.. షకీబ్ అల్ హసన్ వ్యతిరేకించాడు. అంపైర్ను అడిగేందుకు వచ్చిన అతన్ని విరాట్ అడ్డుకొని భుజంపై చేతులు వేసి నోబాల్ మామ అంటూ సర్దిచెప్పాడు. ఈ ఓవర్లో ఇది రెండో బౌన్సరని, అందుకే నోబాల్ అని వివరించాడు. విరాట్ కోహ్లీ సూచనలతో వెనక్కి తగ్గిన షకీబ్ నవ్వుతూ వెనుదిరిగాడు. అయితే అంపైర్లు ఇస్తారు కదా..? నువ్వెందుకు చెప్పావని ప్రశ్నించినట్లు అనిపించింది. ఈ స్వీట్ డిబేట్పై ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ(44 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 64 నాటౌట్), కేఎల్ రాహుల్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో బంగ్లాదేశ్ ముందు టీమిండియా 185 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసింది. రాహుల్, కోహ్లీ హాఫ్ సెంచరీలకు తోడుగా సూర్యకుమార్ యాదవ్(16 బంతుల్లో 4 ఫోర్లతో 30) రాణించాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహముద్ మూడు వికెట్లు తీయగా.. షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు పడగొట్టాడు.