
హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022లో వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా మరో మ్యాచ్కు సిద్దమైంది. పాకిస్థాన్పై థ్రిల్లింగ్ విజయాన్నందుకున్న రోహిత్ సేన అదే జోరులో నెదర్లాండ్స్ను చిత్తు చేసింది. ఆదివారం సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఫామ్ లో ఉండటం.. భారత బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేస్తుండటం భారత్కు కలిసొచ్చే అంశాలు. అయితే టీమిండియా మూడు అంశాల్లో ఇంకా మెరుగు పడాల్సి ఉంది.
ఇందులో మొదటిది ఓపెనింగ్. ఈ మెగా టోర్నీలో భారత్ను ఓపెనింగ్ సమస్య వెంటాడుతోంది. పాకిస్థాన్, నెదర్లాండ్స్తో జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ భారత్కు శుభారంభం దక్కలేదు. పాకిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ తొలి వికెట్ కు 7 పరుగులు జోడిస్తే.. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో తొలి వికెట్ కు 11 పరుగులు మాత్రమే జోడించారు. నెదర్లాండ్స్తో రోహిత్ రాణించినా.. రాహుల్ విఫలమయ్యాడు. ఈ ఇద్దరు మంచి శుభారంభం అందించాల్సిన అవసరం ఉంది.
ఇక రెండోది పవర్ ప్లే.. ప్రస్తుత క్రికెట్లో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుగా టీమిండియా ఉంది. ఎంతటి బౌలింగ్ నైనా సమర్థవంతంగా ఎదుర్కొంటుందనే పేరు కూడా ఉంది. అయితే టీ20 ప్రపంచకప్లో పవర్ ప్లేలో భారత్ కనీసం 6 రన్ రేట్ తో కూడా పరుగులు చేయలేకపోతుంది.
పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో తొలి 6 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 31 పరుగులు మాత్రమే చేసింది. ఇక నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ భారత్ పవర్ ప్లేలో తడబడింది. 6 ఓవర్లలే కేవలం 32 పరుగులు మాతమ్రే చేసి ఒక వికెట్ ను కోల్పోయింది.
ఇక మూడోది డెత్ ఓవర్స్ సమస్య. ఇది ఈ ఏడాది జరిగిన ఆసియా కప్ నుంచి కూడా భారత్ ను ఇబ్బంది పెడుతూ వస్తోంది. పాకిస్తాన్, నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ ల్లోనూ ఈ డొల్లతనం బయటపడింది. ఆఖరి ఐదు ఓవర్లలో ముఖ్యంగా 19వ ఓవర్ లో భారత బౌలర్లు దారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించి చాంపియన్ గా అనిపించుకోవాలంటే టీమిండియా ప్రతి విభాగంలోనూ అద్బుతంగా ఆడాల్సి ఉంటుంది. ఆఖరి బంతికి ఓడినా అది ఓటమి కిందికే వస్తుంది. టోర్నీ జరిగే కొద్ది భారత్ లాగే ఇతర జట్లు కూడా తమ సమస్యలను అధిగమించి టైటిల్ కోసం పోటీ పడతాయి. ఇటువంటి పరిస్థితుల్లో చిన్న తప్పు కూడా ఓటమికి కారణం అవుతాయి.