
అడిలైడ్: మైదానం నలువైపులా షాట్లు కొట్టేందుకు ఎలాంటి ప్రాక్టీస్ చేయనని టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. రబ్బర్ బాల్ క్రికెట్ అతిగా ఆడటంతో ఈ షాట్లు కొట్టడం వచ్చిందని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2022లో విభిన్నమైన బ్యాటింగ్తో దుమ్మురేపుతున్న సూర్య... తనదైన ఇన్నింగ్స్లతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతని బ్యాటింగ్కు యావత్ క్రికెట్ ప్రపంచం ఫిదా అవుతోంది. జింబాబ్వేతో ఆదివారం జరిగిన ఆఖరి సూపర్ 12 పోరులో సూర్య 25 బంతుల్లో 61 పరుగులు బాది అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ అనంతరం వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్తో సరదాగా మాట్లాడిన సూర్య... తన విభిన్నమైన బ్యాటింగ్ వెనుక ఉన్న సీక్రెట్ వెల్లడించాడు.
చిన్నప్పుడు స్నేహితులతో కలిసి రబ్బర్ బాల్ క్రికెట్ ఎక్కువగా ఆడేవాడినని చెప్పిన సూర్య.. అక్కడే ఈ షాట్స్ ఆడటం నేర్చుకున్నానని తెలిపాడు. 'చిన్నప్పుడు స్నేహితులతో కలిసి రబ్బర్ బాల్ క్రికెట్ బాగా ఆడేవాడిని. నా స్నేహితుడొకడు తడి బంతితో 17-18 గజాల నుంచి వేగంగా బౌలింగ్ చేసేవాడు. అప్పుడే ఈ షాట్స్ ఆడటం నేర్చుకున్నాను. అంతే తప్పా ఇలా 360 డిగ్రీల్లో ఆడటానికి నెట్స్లో ఎలాంటి ప్రాక్టీస్ చేయను.'అని తెలిపాడు.
ఇక ఆసీస్ కండిషన్స్ గురించి మాట్లాడుతూ.. 'ఇక్కడ బౌండరీలన్నీ చాలా పెద్దగా ఉంటాయి. ముఖ్యం 80-84 మీటర్ల దూరంలో ఉంటాయి. స్క్వేర్ బౌండరీ కూడా 75-80 మీటర్ల దూరం ఉంటుంది. నాకు తెలిసి రియర్ బౌండరీ ఒక్కటే 60-65 మీటర్లు ఉంటుంది. కాబట్టి నేను ఆ దిశగా షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా షాట్ కొట్టాను'అని తెలిపాడు.
టీ20 ప్రపంచకప్ 2022లో అంచనాలకు తగ్గట్లు దుమ్మురేపిన టీమిండియా సెమీఫైనల్కు దూసుకెళ్లింది. జింబాబ్వేతో ఆదివారం ఏక పక్షంగా సాగిన ఆఖరి సూపర్ 12 మ్యాచ్లో సమష్టిగా రాణించి 71 పరుగులతో గెలుపొందింది. ఈ విజయంతో గ్రూప్-2లో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. సెమీఫైనల్-2లో గ్రూప్-1 రన్నరప్గా నిలిచిన ఇంగ్లండ్తో తలపడనుంది. గురువారం అడిలైడ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో విజయమే లక్ష్యంగా రోహిత్ సేన బరిలోకి దిగుతోంది.