
పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. సారథిగా తన సత్తా ఏంటో తెలియజేశాడు. 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే గట్టి షాకిచ్చాడు. రెండో ఓవర్లోనే అర్ష్దీప్ సింగ్కు బంతినందించి భారత్కు కావాల్సిన బ్రేక్ త్రూ రాబట్టాడు. క్వింటన్ డికాక్ బలహీనతను టార్గెట్ చేస్తూ స్లిప్ ఫీల్డర్ వ్యూహంతో అతనికి చెక్ పెట్టిన రోహిత్.. ఆ తర్వాత ట్రేడ్ మార్క్ రివ్యూతో రీలీ రోసౌ(0)ను పెవిలియన్ చేర్చాడు.
అర్ష్దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికి క్వింటన్ డికాక్(1) స్లిప్ క్యాచ్గా వెనుదిరగ్గా.. మూడో బంతికి రోసౌ వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే ఈ వికెట్ విషయంలో అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. రోహిత్ రివ్యూ తీసుకొని ఫలితం రాబట్టాడు. అర్ష్దీప్ సింగ్ రివ్యూ వద్దని చెప్పినా.. దినేశ్ కార్తీక్ సూచనతో రివ్యూ తీసుకున్న రోహిత్ వికెట్ సాధించాడు. రిప్లేలో బంతి వికెట్లను తాకడంతో థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఈ నిర్ణయంతో భారత ఆటగాళ్లు తెగ సంతోషపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అర్ష్దీప్ దెబ్బకు సౌతాఫ్రికా 3 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులే చేసింది. సఫారీ సూపర్ బౌలింగ్కు టీమిండియా టాప్ 5 బ్యాటర్లు ఆడలేక పెవిలియన్కు క్యూ కట్టారు. దాంతో 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 68) విరోచిత ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు.
దినేశ్ కార్తీక్ సాయంతో 6వ వికెట్కు 52 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. సూర్యకు అండగా మరో బ్యాటర్ రాణించకపోవడంతో టీమిండియా భారీ స్కోర్ చేయలేకపోయింది. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి(4/29), పార్నెల్(3/15) భారత్ పతనాన్ని శాసించారు. అన్రిచ్ నోర్జ్కు ఓ వికెట్ దక్కింది.