
జీలాంగ్: టీ20 ప్రపంచకప్లో నెదర్లాండ్ థ్రిల్లింగ్ విజయాన్నందుకుంది. క్వాలిఫైయర్లో భాగంగా యూఏఈతో ఆదివారం జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. చిన్న జట్లు అయినా.. ఆఖరి బంతి వరకు విజయం ఇరు జట్లను ఊరించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులు చేసింది. ముహమ్మద్ వసీం(47 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లతో 41) ఒక్కడే రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. నెదర్లాండ్ బౌలర్లలో ఫ్రెడ్ క్లాసెన్ 2 వికెట్లు తీయగా.. బాస్ దీ లీడే మూడు వికెట్లు పడగొట్టాడు. టిమ్ ప్రింగిల్, రోయిలఫ్ చెరొక వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన నెదర్లాండ్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 112 పరుగులు చేసి మరో బంతి మిగిలుండగా విజయాన్నందుకుంది. మాక్స్ ఓదౌడ్(23) టాప్ స్కోరర్గా నిలవగా.. స్కాట్ ఎడ్వర్డ్స్(16 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. జునైద్ సిద్దిఖ్ మూడు వికెట్లు తీయగా.. బసిల్ హమీద్, ఆర్యన్ అఫ్జల్ ఖాన్, కార్తీక్ మెయిప్పన్, జహూర్ ఖాన్ తలో వికెట్ తీసారు.
చివరి నాలుగు ఓవర్లలో 26 పరుగులు కావాల్సి ఉండగా.. 17వ ఓవర్లో 7 పరుగులు రాగా సిద్దిఖీ వేసిన 18వ ఓవర్లో 9 పరుగులొచ్చాయి. 19వ ఓవర్ జహూర్ ఖాన్ వేయగా.. ఆ ఓవర్లో టిమ్ ఫ్రింగిల్(15) బౌల్డ్ అయ్యాడు. ఆ ఓవర్లో నాలుగు పరుగులే వచ్చాయి. చివరి ఓవర్లో ఆరు పరుగులు కావాల్సి ఉండగా.. జవార్ ఫరీద్ తొలి మూడు బంతుల్లో మూడు పరుగులే ఇచ్చాడు. కానీ నాలుగో బంతికి రెండు పరుగులొచ్చాయి. ఐదో బంతికి కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్ (19 బంతుల్లో 16 నాటౌట్) సింగిల్ తీసి జట్టుకు విజయాన్ని అందించాడు.