
సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022లో అసలు సిసలు పోరుకు రంగం సిద్దమైంది. బుధవారం సిడ్నీ వేదికగా న్యూజిలాండ్-పాకిస్థాన్ మధ్య జరగనున్న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్తో నాకౌట్ సమరానికి తెర లేవనుంది. భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
గ్రూప్-1 టాపర్గా న్యూజిలాండ్ సెమీస్కు చేరుకోగా.. అదృష్టం కలిసి రావడంతో గ్రూప్-2 రన్నరప్గా పాకిస్థాన్ నాకౌట్ బెర్త్ సాధించింది. గురువారం జరగనున్న రెండో సెమీస్లో భారత్-ఇంగ్లండ్ తలపడనున్నాయి. దాంతో తొలి సెమీ ఫైనల్లో పాక్.. రెండో సెమీ ఫైనల్లో భారత్ గెలిస్తే మరోసారి దాయాదుల పోరును చూడవచ్చని అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ క్రమంలోనే భారత అభిమానులకు సంబంధం లేని పాక్-న్యూజిలాండ్ తొలి సెమీ ఫైనల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే పాకిస్థాన్తో పోలిస్తే న్యూజిలాండ్ చాలా పటిష్టంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా ఏ విషయం చూసుకున్నా పాక్ కంటే మెరుగ్గానే కనిపిస్తోంది. కానీ టీ20 ఫార్మాట్లో న్యూజిలాండ్పై పాకిస్థాన్దే పై చేయిగా ఉంది. ఇప్పటివరకు న్యూజిలాండ్-పాకిస్థాన్ల మధ్య మొత్తం 28 టీ20 మ్యాచ్లు జరగ్గా.. పాక్ 17 మ్యాచ్ల్లో, న్యూజిలాండ్ 11 మ్యాచ్ల్లో గెలుపొందాయి. టీ20 వరల్డ్కప్లో ఇరు జట్లు 6 సందర్భాల్లో తలపడగా.. పాక్ 4 సార్లు, కివీస్ 2 సార్లు విజయం సాధించింది. అంతేకాకుండా గత 5 టీ20ల్లో పాక్ 4 మ్యాచ్ల్లో గెలువగా.. న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్లో మాత్రమే నెగ్గింది.
మరోవైపు ప్రపంచకప్ సెమీ ఫైనల్స్లోనూ న్యూజిలాండ్పై పాక్దే పైచేయిగా ఉంది. ఈ రెండు జట్లు వన్డే, టీ20 ప్రపంచకప్ల్లో మూడుసార్లు సెమీఫైనల్స్లో తలపడగా.. అన్నింటిలో పాకిస్థానే విజయం సాధించింది. 1992 వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్లో పాక్.. న్యూజిలాండ్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. 1999 వరల్డ్కప్ సెమీఫైనల్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 2007 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లోనూ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతేకాకుండా ఈ మెగా టోర్నీకి ముందు న్యూజిలాండ్ వేదికగా జరిగిన ట్రై సిరీస్ను కూడా పాక్ కైవసం చేసుకుంది. ఈ రికార్డులే ఇప్పుడు న్యూజిలాండ్ను కలవరపెడుతున్నాయి. మరీ రేపటి మ్యాచ్లో కేన్ మామ ఈ రికార్డులను తిరగరాస్తోడో లేక.. ఎప్పటిలానే దాసోహం అంటాడో చూడాలి!