
యూఏఈ ఔట్..
ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో గ్రూప్-ఏలో ఉన్న శ్రీలంక.. గ్రూప్ టాపర్ నెదర్లాండ్స్తో చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే శ్రీలంక సూపర్ 12కు అర్హత సాధించనుంది. లేకుంటే పాయింట్స్ టేబుల్లో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న నమీబియా ముందడుగు వేస్తోంది. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిన యూఏఈ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-ఏ, గ్రూప్-బిలో టాప్-2 టీమ్స్ సూపర్ -12కు అర్హత సాధించనున్నాయి. ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్-8లో ఉన్న జట్లు నేరుగా సూపర్ 12 ఆడనున్నాయి.

చెలరేగిన పాతుమ్ నిస్సంక
యూఏఈతో జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది. లంక ఓపెనర్ పాతుమ్ నిస్సంక(60 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 74) హాఫ్ సెంచరీతో రాణించగా.. ధనుంజయ డిసిల్వా(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 33) విలువైన పరుగులు చేశాడు. ఈ ఇద్దరి ధాటికి శ్రీలంక తొలి 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది. కానీ ఆ తర్వాత యూఏఈ బౌలర్లు చెలరేగడంతో వరుసగా వికెట్లు కోల్పోయింది.
తమిళనాడు కుర్రాడి హ్యాట్రిక్..
భారత సంతతి, యూఏఈ లెగ్ స్పిన్నర్ కార్తీక్ మెయప్పన్ సంచలన హ్యాట్రిక్తో శ్రీలంక ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో కార్తీక్ మెయప్పన్ ఈ ఘనతను అందుకున్నాడు. తద్వారా ఈ ప్రపంచకప్లో హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్గా చరిత్రకెక్కాడు. నాలుగో బంతికి భానుక రాజపక్స, అయిదో బంతికి చరిత్ అసలంక, ఆరో బంతికి డాసన్ శనక పెవిలియన్ దారి పట్టారు. కార్తీక్(3/19)కు తోడుగా జహూర్ ఖాన్(2/26) రాణించాడు.

హసరంగా, చమీరా తీన్మార్..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన యూఏఈ 17.1 ఓవర్లలో 73 పరుగులకు కుప్పకూలింది. వానిందు హసరంగా(3/8), దుష్మంత్ చమీరా(3/15)తమ బౌలింగ్తో తీన్మార్ వేయడంతో యూఏఈ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. మహీష్ తీక్షణకు రెండు వికెట్లు దక్కగా.. ప్రమోద్ మధుషాన్, డసన్ శనక తలో వికెట్ తీసారు. యూఏఈ బ్యాటర్లలో అయాన్ అఫ్జాల్ ఖాన్(19), జునైద్ సిద్దిఖీ(18) టాప్ స్కోరర్లుగా నిలిచారు. బౌలింగ్లో రాణించిన యూఏఈ.. బ్యాటింగ్లో కనీస పోరాటం చేయలేక ఇంటిదారి పట్టింది.

పాపం మెయప్పన్..
దాంతో ఈ టోర్నీలో హ్యాట్రిక్ సాధించిన ఆ జట్టు లెగ్ స్పిన్నర్ కార్తీక్ మెయప్పన్ కష్టం వృథా అయ్యింది. తమిళనాడులోని చెన్నైకి చెందిన కార్తీక్ మెయప్పన్ ఫ్యామిలీ 2012లో యూఏకి వెళ్లి స్థిరపడింది. 2019 అండర్ 19 ఏసియా కప్ టోర్నీలో యూఏఈ కెప్టెన్గా వ్యవహరించిన కార్తీక్ పలని మెయ్యప్పన్ యూఏఈ తరుపున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగ్రేటం చేశాడు. మెయప్పన్ ఇలానే ఆడితే అతి త్వరలోనే ఐపీఎల్లో చూస్తామని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications
