
బ్రిస్బేన్: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో తమ ఓటమికి ప్రధాన కారణం ఒత్తిడి అధిగమించలేకపోవడమేనని న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ అన్నాడు. మంగళవారం జరిగిన ఈ కీలక పోరులో ఇంగ్లండ్ సమష్టిగా రాణించి 20 పరుగులతో గెలుపొందింది. ఈ విజయంతో సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన కేన్ మామ.. తమ కంటే ఇంగ్లండ్ అద్భుతంగా ఆడిందని ప్రశంసించాడు. ఈ గెలుపు క్రెడిట్ వారిదేనని, తమను ఒత్తిడిలోకి నెట్టి ఓడించిందని తెలిపాడు.
'ఇంగ్లండ్ మా కంటే అద్భుతంగా ఆడింది. ఈ విజయం క్రెడిట్ వారిదే. మమల్ని ఒత్తిడిలోకి నెట్టి ఓడించింది. వారు చాలా అద్భుతంగా ఆడారు. వారి ఆటకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సమష్టి ప్రదర్శన కనబర్చారు. చేధించాల్సిన లక్ష్యమే అయినప్పటికీ ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బట్లర్ క్యాచ్ నేలపాలు చేయాల్సింది కాదు. కానీ అది చాలా క్లిష్టమైన క్యాచ్. అది పట్టాననే అనుకున్నా. రిప్లేలు చూసే వరకు బంతి కిందపడిందనే విషయం నాకు తెలియదు.
ఈ అవకాశాన్ని అందుకున్న బట్లర్ మా సరదా తీర్చేసాడు. అద్భుతమైన ఇన్నింగ్స్తో మ్యాచ్ను లాగేసాడు. ఫిలిప్స్ ఇన్నింగ్స్ అసాధారణం. గత మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన అతను.. ఈ మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగించాడు. కానీ ఒత్తిడికి లోనైన మేం వరుసగా వికెట్లు చేజార్చుకొని మూల్యం చెల్లించుకున్నాం. ఈ తప్పిదాలను సవరించుకొని తదుపరి మ్యాచ్కు సిద్దమవుతాం'అని కేన్ మామ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసింది. జోస్ బట్లర్(47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 73), అలెక్స్ హేల్స్(40 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 52) హాఫ్ సెంచరీతో దుమ్మురేపారు. న్యూజిలాండ్ బౌలర్లలో లూకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ, మిచెల్ సాంట్నర్, ఇష్ సోదీ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.
గ్లేన్ ఫిలిప్స్(36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 62) హాఫ్ సెంచరీతో రాణించగా.. కేన్ విలియమ్సన్(40 బంతుల్లో 3 ఫోర్లతో 40) అతనికి అండగా నిలిచాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, సామ్ కరన్ రెండు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్, బెన్ స్టోక్స్ తలో వికెట్ తీసారు. ఈ విజయంతో ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలు మెరుగవ్వగా.. కివీస్ సంక్లిష్టం చేసుకుంది. ఐర్లాండ్తో జరిగే చివరి మ్యాచ్లో కివీస్ తప్పక గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ఈ మ్యాచ్ ఓడినా..వర్షంతో రద్దు అయినా కివీస్ సెమీస్ చేరడం కష్టం.