
ఏడాది తర్వాత...
గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన షమీ మళ్లీ ఇన్నాళ్లకు భారత్ తరఫున బరిలోకి దిగాడు. ఏడాది తర్వాత మళ్లీ టీ20ల్లో అవకాశం దక్కడంపై షమీ సంతోషం వ్యక్తం చేశాడు. ఇదే విషయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. కానీ ప్రాక్టీస్ మ్యాచ్లో మహమ్మద్ షమీకి రోహిత్ బంతిని త్వరగా ఇవ్వలేదు. మ్యాచ్ పూర్తయ్యేందుకు వస్తున్నా.. షమీని బౌలింగ్ను దించకపోవడంపై నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఈ మ్యాచ్లో షమీ బౌలింగ్ చేస్తాడా? లేదా? అని అనుమానపడ్డారు.

చివరి ఓవర్ వరకూ..
అనూహ్యంగా ఆఖరి ఓవర్లో 11 పరుగులు చేస్తే ఆస్ట్రేలియా గెలుస్తుందన్న పరిస్థితుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ.. షమీ చేతికి బంతిని అందించాడు. గత ఏడాదిగా టీ20 మ్యాచ్ ఆడని షమీతో డెత్ ఓవర్ బౌలింగ్ చేయించడం అనేది అతనికి ఓరకంగా అగ్నిపరీక్షే. ఇటీవలి కాలంలో భారత బౌలర్ల డెత్ ఓవర్ బౌలింగ్ చూశాక ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది. కానీ షమీ అద్భుతం చేశాడు. తొలి 2 బంతులకు 4 పరుగులు ఇచ్చిన షమీ.. తర్వాతి బంతికి కమిన్స్ను ఔట్ చేశాడు. ఈ వికెట్ దక్కడంలో క్రెడిట్ అద్భుతమైన క్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీకే ఎక్కువగా దక్కుతుంది.
మొత్తం నాలుగు వికెట్లతో..
తర్వాతి బంతికి అగర్ను రనౌట్ చేసిన షమీ.. చివరి రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి ఆసీస్ కథ ముగించాడు. కొద్ది వారాల క్రితం కరోనా వైరస్ బారిన పడిన షమీ.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో టీ20 సిరీస్లకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఎన్సీఏలో చేరి శ్రమించాడు. కొద్ది రోజుల క్రితమే ఆస్ట్రేలియా చేరుకొని ప్రాక్టీస్ మ్యాచ్ చివరి ఓవర్లో బౌలింగ్ చేసి సత్తా చాటాడు. షమీని పరీక్షించడం కోసమే అతనికి ఆఖరి ఓవర్లో బంతిని ఇచ్చామని మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ చెప్పాడు. రోహిత్, బీసీసీఐ పెట్టిన పరీక్షలో షమీ సూపర్ సక్సెస్ సాధించాడు. డెత్ ఓవర్లలో భారత బౌలర్ల తడబాటుకు తెరదించాడు. దీంతో షమీపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ ప్రదర్శన తర్వాత టీమిండియా ప్రపంచకప్ గెలవడం ఖాయమనిపిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

సూర్య.. సూపరో సూపర్..
ఈ సన్నాహక మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 57), సూర్యకుమార్ యాదవ్(33 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 50) హాఫ్ సెంచరీలు బాదారు. ఆసీస్ బౌలర్లలో కేన్ రిచర్డ్సన్ నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, గ్లేన్ మ్యాక్స్వెల్, అష్టన్ అగర్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులకు కుప్పకూలింది. ఒకే ఒక ఓవర్ వేసిన మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా.. భువీ రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్దీప్ సింగ్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.


Click it and Unblock the Notifications
