
హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియాకు బిగ్ టెన్షన్ తప్పింది. పాకిస్థాన్పై సాధించిన అద్భుత విజయంతో పాటు వర్షం కారణంగా సౌతాఫ్రికాకు చేజారిన గెలుపుతో టీమిండియా సెమీస్ అవకాశాలు మెరగయ్యాయి. చిన్న దేశాలను చితక్కొడితే చింత లేకుండా రోహిత్ సేన సెమీస్కు దూసుకెళ్తోంది. గ్రూప్-2లో సౌతాఫ్రికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్,జింబాబ్వే, నెదర్లాండ్ జట్లతో ఉన్న టీమిండియా.. ఒక విజయంతో పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో ఉంది.
టీమిండియాకు గట్టి పోటీనిచ్చే జట్లు పాకిస్థాన్, సౌతాఫ్రికా మాత్రమే. మిగతా జట్లను తక్కువ అంచనా వేయాల్సిన పని లేదు.. కానీ టీమిండియా స్థాయికి పోటీ ఇవ్వలేనివి. ప్రధాన జట్లలో ఇప్పటికే పాకిస్థాన్ను ఓడించిన టీమిండియా.. సౌతాఫ్రికాతో ఓడినా సెమీస్ అవకాశాలకు వచ్చే నష్టం ఏమిలేదు. ఇతర చిన్నట్లు జట్లు అయిన బంగ్లాదేశ్, జింబాబ్వే, నెదర్లాండ్స్ను ఓడిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీఫైనల్కు దూసుకెళ్తుంది.
ఎందుకంటే జింబాబ్వేతో సోమవారం జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా విజయాన్ని వరణుడు లాగేసాడు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దవ్వడంతో చెరొక పాయింట్ కేటాయించారు. దాంతో సౌతాఫ్రికాకు మిగతా మ్యాచ్లన్నీ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం 1.30కు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించింది. వర్షం కాస్త బ్రేక్ ఇవ్వడంతో మ్యాచ్ను 9 ఓవర్లకు కుదించి ప్రారంభించారు. ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 9 ఓవర్లలో 5 వికెట్లకు 79 పరుగులు చేసింది.
వెస్లీ మధెవెరె(18 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 35 నాటౌట్) ధాటిగా ఆడగా.. మిల్టన్ షుంబా(20 బంతుల్లో 2 ఫోర్లతో 18 నాటౌట్) అండగా నిలిచాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీయగా.. అన్రిచ్ నోర్జ్, వ్యాన్ పార్నెల్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా తమ ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించింది. డికాక్ తొలి బంతి నుంచే హిట్టింగ్కు దిగాడు. వరుసగా ఐదు బంతులను 4, 4, 4, 6, 4 బౌండరీలకు తరలించాడు.
చివరి బంతికి సింగిల్ తీసి 23 పరుగులు పిండుకున్నాడు. రెండో ఓవర్లో ఓ బంతి వేయగానే మళ్లీ వర్షం ప్రారంభమైంది. కొద్దిసేపటి తర్వా వర్షం ఆగిపోవడంతో అంపైర్లు మైదానాన్ని పరిశీలించి ఆటను తిరిగి ప్రారంభించారు. మరో రెండు ఓవర్ల ఆటను కుదించి 7 ఓవర్లలో సౌతాఫ్రికా టార్గెట్ను 64గా నిర్ణయించారు. ఆ తర్వాత కూడా డికాక్ తన జోరును కొనసాగించాడు. రెండో ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలతో మొత్తం నాలుగు ఫోర్లు కొట్టిన అతను రెండో ఓవర్లో జట్టు స్కోర్ను 40 ధాటించాడు. ఆ తర్వాత మళ్లీ వర్షం రావడంతో మ్యాచ్ను రద్దు చేశారు.