
హైదరాబాద్: ఎన్నో అంచనాల మధ్య టీ20 ప్రపంచకప్ 2022 బరిలోకి దిగిన టీమిండియా.. ఫైనల్ చేరకుండానే ఇంటిదారిపట్టింది. రోహిత్ సేన జైత్రయాత్ర సెమీస్కు మాత్రమే పరిమితమైంది. ఇంగ్లండ్తో గత గురువారం జరిగిన సెమీఫైనల్-2లో టీమిండియా సమష్టిగా విఫలమై 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమితో మరోసారి టైటిల్ గెలిచే సువర్ణవకాశాన్ని టీమిండియా చేజార్చుకుంది. అయితే టీమిండియా ఓటమి అభిమానులనే కాదు.. భారత్లో కోట్ల వ్యాపారాన్ని దెబ్బతీసింది. అటు బీసీసీఐ, ఐసీసీతో పాటు ఇటు బ్రాడ్కాస్టర్లకు తీరని నష్టం తెచ్చిపెట్టింది. భారతే గనుక ఫైనల్ చేరి ఉంటే.. దాయాదుల సమరాన్ని యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూసేది.
అప్పుడు అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ పంట పండేది. గ్రూప్ స్టేజ్లోనే ఆఖరి బంతి వరకు సాగిన ఉత్కంఠ మ్యాచ్ను కోట్ల మంది వీక్షించారు. ఇక ఫైనల్ అయితే ఆ రెస్పాన్స్ డబుల్గా ఉండేది. మెల్బోర్న్ మైదానం కిక్కిరిసేది. భారత్లో బార్లు, రిసార్ట్లు కిటకిటలాడేవి. క్రికెట్ను మతంగా ప్రేమించే భారత్లో జనాలు ఆట కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. ఈ వీక్నెస్ను వ్యాపార సంస్థలు క్యాష్ చేసుకునే పనిలో ఉంటాయి. భారత్-పాక్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ను బిగ్ స్క్రీన్స్పై లైవ్ ఇచ్చి.. కోట్ల రూపాయలు సంపాదించారు. బార్లు, రెస్టారెంట్ల ద్వారా వచ్చిన ఆదాయానికి లెక్కల్లేవ్.
క్రికెట్ ఫీవర్ను క్యాష్ చేసుకోవడానికి బార్లు, రిసార్ట్లు సైతం స్పెషల్ ఆఫర్స్ ప్రకటించడం, బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేయడం సర్వసాధారణం. కానీ భారత్ ఫైనల్ చేరకపోవడంతో జనాలు ఈ ఫైనల్ను లైట్ తీసుకుంటున్నారు. క్రికెట్ను అమితంగా ఇష్టపడే వారు మాత్రమే ఈ మ్యాచ్ను వీక్షిస్తున్నారు. భారత్ ఫైనల్ చేరకపోవడం వల్ల అధికారిక బ్రాడ్కాస్టర్స్తో పాటు మీడియా, వెబ్సైట్స్, యూట్యూబ్ చానెళ్లు తమ ఆదాయాన్ని కోల్పోతున్నాయి. క్రికెట్తో దేశంలో వేల కోట్ల బిజినెస్ ముడిపడటమే దీనికి ప్రధాన కారణం. ఇంగ్లండ్-పాక్ ఫైనల్ మ్యాచ్ను హాట్స్టార్ 56 లక్షల మంది చూస్తున్నారు. అదే భారత్-పాక్ అయితే ఈ సంఖ్య మూడింతలుగా ఉండేది.
పాకిస్థాన్తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నానని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. ఇది చాలా పెద్ద మ్యాచని చెప్పిన బట్లర్.. తమ ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారని తెలిపాడు. 'అభిమానులతో మైదానం కిక్కిరిసింది. ఇది తమకు కొత్త శక్తినిస్తుంది. ఈ మ్యాచ్ను గొప్పగా మార్చడంపై మేం ఫోకస్ పెట్టాం. అద్భుత ఫామ్తో రెండు జట్లు ఫైనల్ చేరాయి. ఈ సవాల్ను స్వీకరించేందుకు మేం సిద్దంగా ఉన్నాం.'అని బట్లర్ తెలిపాడు.