T20 World Cup 2022: సౌతాఫ్రికా విజయం.. టీమిండియాకు అదొక్కటే భయం! పాక్ సెమీస్ అవకాశాలు ఇవే!

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా తొలి పరాజయాన్ని చవిచూసింది. సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన రోహిత్ సేన 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో గ్రూప్-2లో టీమిండియా తమ అగ్రస్థానాన్ని కోల్పోగా.. సౌతాఫ్రికా టాప్ ప్లేస్కు చేరుకుంది. సఫారీ టీమ్ ఇప్పటి వరకూ 3 మ్యాచ్లు ఆడగా.. జింబాబ్వేతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.
బంగ్లా, భారత్లపై వరుస విజయాలు సాధించిన సఫారీ జట్టు 5 పాయింట్లతోపాటు మెరుగైన రన్రేట్తో నంబర్ వన్గా నిలిచింది. భారత్ రెండు విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానానికి పడిపోయింది. 4 పాయింట్లతో బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉండగా.. జింబాబ్వే (3 పాయింట్లు), పాకిస్థాన్ (2) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్పై సౌతాఫ్రికా విజయం సాధించడంతో నెదర్లాండ్స్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.
రెండిట్లో గెలిస్తే సెమీస్కు బంగ్లా..
పాకిస్థాన్ ఆశలు కూడా గల్లంతవ్వగా.. టెక్నికల్గా అవకాశం ఉంది. సౌతాఫ్రికా సెమీస్ అవకాశాలు మెరుగవ్వగా.. టీమిండియాను వర్షం భయం వెంటాడుతోంది. సంచలనాలు నమోదు చేస్తే జింబాబ్వే, బంగ్లాదేశ్కు అవకాశం ఉంది. బంగ్లాదేశ్ టాప్-4లో నిలవాలంటే తదుపరి మ్యాచ్ల్లో భారత్, పాకిస్థాన్లపై విజయం సాధిస్తే.. 8 పాయింట్లతో సెమీస్ చేరుతుంది. ఇది కష్టంతో కూడుకున్న పని.

టీమిండియాను వెంటాడుతున్న వర్షం భయం..
భారత్ తన చివరి మ్యాచ్ల్లో బంగ్లాదేశ్, జింబాబ్వేలతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్ల్లో గెలిస్తే ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా సెమీఫైనల్ చేరుతుంది. ఒక వేళ బంగ్లా చేతిలో ఓడితే మాత్రం.. జింబాబ్వేపై కచ్చితంగా గెలవాలి.. ఒకవేళ పాక్ తర్వాతి రెండు మ్యాచ్ల్లో గెలిస్తే మెరుగైన రన్రేట్ ఉన్న జట్టు సెమీస్ చేరుతుంది. వర్షం కురిసి మ్యాచ్లు రద్దయినా టీమిండియాకు ఇబ్బందే. భారత్ జింబాబ్వే మధ్య నవంబర్ 6న జరిగే మ్యాచ్ వర్షాలు ఎక్కువగా కురుస్తోన్న మెల్బోర్న్లో జరగనుంది. కాబట్టి బంగ్లాపై గెలిస్తే రోహిత్కు టెన్షన్ ఉండదు.

సౌతాఫ్రికా సేఫ్ సైడ్..
సౌతాఫ్రికా తర్వాతి మ్యాచ్ల్లో పాకిస్థాన్, నెదర్లాండ్స్తో తలపడనుంది. ఈ రెండింట్లో గెలిస్తే ఆ జట్టు టేబుల్ టాపర్గా నిలుస్తుంది. ఒకవేళ పాక్ చేతిలో ఓడితే సఫారీల ఖాతాలో 7 పాయింట్లు చేరతాయి. అప్పటికీ సెమీస్ చేరే ఛాన్స్ ఉంది. ఒకవేళ మిగతా రెండు మ్యాచ్ల్లో ఓడితే మాత్రమే సౌతాఫ్రికా సెమీస్ అవకాశాలు సన్నగిల్లుతాయి. తదుపరి రెండు మ్యాచ్ల్లో ఒక్కటి గెలిచినా ఆ జట్టుకు వచ్చే నష్టం లేదు. రెండు ఫలితం తేలకుండా ముగిసినా సెమీఫైనల్ బెర్త్ ఖాయం.
లక్ ఉంటేనే పాకిస్థాన్కు చాన్స్..
పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే.. తన చివరి రెండు మ్యాచ్ల్లో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్లపై భారీ విజయాలు సాధించాలి. అంతే కాకుండా భారత్.. బంగ్లా చేతిలో ఓడి, జింబాబ్వేపై తక్కువ మార్జిన్తో గెలిస్తే... మెరుగైన నెట్ రన్ రేట్ ఆధారంగా పాక్ టాప్-4లో నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికైతే పాక్ కంటే భారత్కు మెరుగైన నెట్ రన్రేట్ ఉంది. పాకిస్థాన్ను సౌతాఫ్రికా ఓడిస్తే చాలు.. దాయాది సెమీస్ రేసు నుంచి వైదొలిగినట్టే. నవంబర్ 3న దక్షిణాఫ్రికా, పాక్ మధ్య జరిగే మ్యాచ్ కీలకం కానుంది. అద్భుతం జరిగితే తప్పా.. పాక్ సెమీస్ చేరడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications