
అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న కీలక సెమీఫైనల్లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా(33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 63)దుమ్మురేపాడు. దాంతో టీమిండియా 169 పరుగుల పోరాడే లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచింది. హార్దిక్ పాండ్యాకు తోడుగా విరాట్ కోహ్లీ(40 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 50) హాఫ్ సెంచరీతో రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్, క్రిస్ వోక్స్ తలో వికెట్ తీసారు.
ఇంగ్లండ్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్తో తొలి 13 ఓవర్లు తడబడిన భారత్.. హార్దిక్ పాండ్యా విధ్వంసకర బ్యాటింగ్తో చివరి 7 ఓవర్లలో 88 పరుగులు చేసింది. ముఖ్యంగా చివరి 4 ఓవర్లలోనే 58 పరుగులు పిండుకుంది. ఓ దశలో కనీసం 160 పరుగులైనా చేస్తుందా? అనిపించిన టీమిండియా.. హార్దిక్ ధనాధన్ బ్యాటింగ్తో పోరాడే లక్ష్యాన్ని అందుకుంది. ముఖ్యంగా సామ్ కరన్ వేసిన 19వ ఓవర్లో రిషభ్ పంత్ ఓ బౌండరీ బాదగా.. హార్దిక్ 4, 6, 4, 4 బౌండరీలు బాది 20 పరుగులు పిండుకున్నాడు.
జోర్డాన్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి రెండు బంతుల్లో సింగిల్సే రాగా.. మూడో బంతికి పంత్ రనౌటయ్యాడు. నాలుగో బంతిని సిక్స్ బాదిన హార్దిక్ పాండ్యా.. ఆఖరి రెండు బంతులను బౌండరీలకు తరలించాడు. కానీ దురదృష్టవశాత్తు ఆఖరి బంతికి హార్దిక్ పాండ్యా హిట్ వికెట్ అవ్వడంతో భారత్ ఖాతాలో నాలుగు పరుగులే చేరాయి. ఈ బంతికి హార్దిక్ ఔటవ్వకుండా ఉండి ఉంటే.. టీమిండియా స్కోర్ 172 పరుగులకే చేరేది. అది బౌలర్లకు అడ్వాంటేజ్గా ఉండేది. ఇంగ్లండ్కు కూడా సైకాలజికల్గా కాస్త ప్రెజర్ ఉండేది. ఏది ఏమైనా.. ఆఖరి బంతికి నాలుగు పరుగులు రాకపోవడం టీమిండియాకు నష్టం చేసేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా 10 పరుగులు తక్కువ చేసిందని, అయినా ఈ లక్ష్యం కాపాడుకోదగినదేనని సూచిస్తున్నారు.