విరాట్ కోహ్లీ కంటే అతనే గొప్ప బ్యాట్స్మన్: గౌతమ్ గంభీర్

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై బీజేపీ ఎంపీ, మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. పాకిస్థాన్ అన్నా.. విరాట్ కోహ్లీ అన్నా నోరుపారేసుకునే గంభీర్.. తాజాగా అతన్ని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేశాడు.
టీ20 ప్రపంచకప్ 2022లో సూపర్ ఫామ్తో చెలరేగుతున్న విరాట్ కోహ్లీని చూసి సహించలేకపోతున్న గంభీర్.. తన నోటికి పనిచెప్పాడు. అవసరం లేని సందర్భంలో విరాట్ పేరును ప్రస్తావించి అతని అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా నెదర్లాండ్స్తో ఇటీవల జరిగిన మ్యాచ్లో కోహ్లీతో పాటు సూర్యకుమార్ యాదవ్ చెలరేగాడు.

సూర్య బెస్ట్ బ్యాటర్..
సూర్య బ్యాటింగ్ను కొనియాడిన గంభీర్.. విరాట్ కోహ్లీ కంటే అతనే గొప్ప బ్యాట్స్మన్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో సూర్య ఇన్నింగ్స్ విశ్లేషించిన గంభీర్.. అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ కంటే బెస్ట్ బ్యాట్స్మన్ ఎవరూ లేరు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మాదిరిగా పవర్ ప్లేలో బ్యాటింగ్ చేసే సదుపాయం సూర్యకుమార్ యాదవ్కు లేదు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేటప్పుడు ఫీల్డర్లు బౌండరీ దగ్గర ఉంటారు.

కోహ్లీ కంటే గొప్పోడు..
అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చి బౌండరీలు బాదడం అంటే మామూలు విషయం కాదు. వచ్చి రాగానే సిక్సర్ కొట్టగల సత్తా సూర్యకుమార్ యాదవ్కు ఉంది. విరాట్ కోహ్లీ కానీ కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఇలా చేయలేరు. భారత బ్యాటింగ్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే మిగిలిన బ్యాటర్ల నుంచి ఒత్తిడిని తొలగించగలడు. అందుకే అతనే బెస్ట్ బ్యాటర్. సూర్యకుమార్ యాదవ్ వచ్చీ రాగానే బౌండరీలు కొట్టడం వల్లే విరాట్ కోహ్లీ ఒత్తిడి పోయి, స్వేచ్చగా ఆడగలిగాడు. కోహ్లీ మంచి ప్లేయరే కావచ్చు... సూర్యకంటే బెస్ట్ బ్యాటర్ మాత్రం కాదు.

మ్యాచ్లు మలుపులు తిప్పేది వారే..
సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా పరుగులు చేస్తే టీమిండియా వరల్డ్ కప్ గెలవడం కష్టమేమీ కాదు. టాప్ 3లో ఉన్న బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేస్తారు, సెంచరీలు కొడతారు. అయితే నాలుగు, ఐదో స్థానంలో ఉన్న సూర్యకుమార్, హార్ధిక్ పాండ్యా ఆడే ఇన్నింగ్స్లే మ్యాచ్లను మలుపు తిప్పుతాయి.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు. గంభీర్ వ్యాఖ్యలపై కోహ్లీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ అంటే నచ్చని గంభీర్.. అతని సక్సెస్ను చూసి ఓర్వలేకపోతున్నాడని కామెంట్ చేస్తున్నారు.

2013 ఐపీఎల్ గొడవతో..
వాస్తవానికి కోహ్లీ కెరీర్ ఆరంభంలో గంభీర్ అతనికి అండగా నిలిచాడు. ఇద్దరూ ఢిల్లీకి చెందినవారే కావడంతో మంచి సంబంధాలు ఉండేవి. కోహ్లీ కెరీర్ ఆరంభంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ను కూడా అరంగేట్ర సెంచరీ అందుకున్న విరాట్కు ఇచ్చి ఎంకరేజ్ చేశాడు. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోనూ ఈ ఇద్దరూ తీవ్ర ఒత్తిడిలో కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 2013 ఐపీఎల్ సందర్భంగా మైదానంలో ఇద్దరూ ఘర్షణకు దిగారు. అప్పటి నుంచి ఈ ఇద్దరూ ఉప్పు-నిప్పుగా ఉంటున్నారు. విరాట్.. గంభీర్ గురించి ఎలాంటి కామెంట్ చేయకున్నా.. అతను మాత్రం అవసరమైనప్పుడల్లా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications