మెల్బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ బౌలర్లు దుమ్మురేపారు. సామ్ కరన్(3/12) తీన్మార్కు ఆదిల్ రషీద్(2/22), క్రిస్ జోర్డాన్(2/27) దోబార్ వేయడంతో పాకిస్థాన్ 138 పరుగుల సాధారణ లక్ష్యాన్నే నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేసింది. షాన్ మసూద్(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 38), బాబర్ ఆజామ్(28 బంతుల్లో 2 ఫోర్లతో 32), షాదాబ్ ఖాన్(14 బంతుల్లో 2 ఫోర్లతో 20) మినహా అంతా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లకు తోడుగా.. ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లు తీసారు. బెన్ స్టోక్స్కు ఓ వికెట్ దక్కింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్కు శుభారంభం దక్కలేదు. సామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్లోనే మహమ్మద్ రిజ్వాన్(15) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో పవర్ ప్లేలో పాక్ వికెట్ నష్టానికి 39 పరుగులు మాత్రమే చేయగలిగింది. పవర్ ప్లే అనంతరం జోస్ బట్లర్ స్పిన్నర్లను బరిలోకి దించి ఫలితం రాబట్టాడు. మహమ్మద్ హరీస్(8)ను రషీద్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన షాన్ మసూద్తో కలిసి బాబర్ స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. షాన్ మసూద్ ధాటిగా ఆడటంతో పాక్ 10 ఓవర్లలో 2 వికెట్లకు 68 పరుగులు చేసింది. ఆ మరుసటి ఓవర్లో క్రీజులో సెట్ అయిన బాబర్ ఆజామ్(28 బంతుల్లో 32)ను ఆదిల్ రషీద్ రిటర్న్ క్యాచ్తో పెవిలియన్ చేర్చాడు.
ఆ వెంటనే బెన్ స్టోక్స్ సూపర్ బౌన్సర్తో ఇఫ్తికర్ అహ్మద్(0)ను కీపర్ క్యాచ్గా ఔట్ చేశాడు. దాంతో పాక్ 85 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన షాదాబ్ ఖాన్, షాన్ మసూద్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. సామకరన్ వేసిన 17వ ఓవర్లో డేంజరస్ షాన్ మసూద్(38)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో షాదాబ్ ఖాన్(20), మహమ్మద్ నవాజ్(5), మహమ్మద్ వసీం(4) క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరారు. దాంతో పాక్ 137 పరుగులకే పరిమితమైంది.