సిడ్నీ: భారత సెలెక్టర్లపై ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం బ్రెట్ లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ అయిన కశ్మీర్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ను టీ20 ప్రపంచకప్ జట్టులోకి తీసుకోకపోవడాన్ని తప్పుబట్టాడు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన బంతులు విసురుతున్న ఉమ్రాన్ మాలిక్ ను కాదని మిగతావాళ్లను ఎంపిక చేయడమేంటని విమర్శించాడు.
బ్రెట్ లీ మాట్లాడుతూ.. 'ఉమ్రాన్ మాలిక్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తాడు. కానీ సెలక్లర్లు అతన్ని పక్కనబెట్టారు. ప్రపంచంలో అత్యుత్తమ కారును మీ దగ్గర పెట్టుకుని దానిని ఉపయోగించకుండా గ్యారేజ్ లో పడేస్తే దానివల్ల ఎవరికి ఉపయోగం? అప్పుడు ఆ కారుకు విలువ ఉంటుందా? ఉమ్రాన్ మాలిక్ ను టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసి ఉండాల్సింది. అతను యువకుడే కావొచ్చు. అంతర్జాతీయ స్థాయిలో అనుభవం లేకపోవచ్చు. కానీ ఉమ్రాన్.. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరగలిగే సత్తా ఉన్నోడు. ఆస్ట్రేలియాలో పేస్ బౌలర్లు సమర్థవంతంగా రాణిస్తారు.' అని తెలిపాడు.
బుమ్రా లేకపోవడం భారత జట్టుకు లోటు అని దీంతో ఆ బరువును ఇప్పుడు భువనేశ్వర్ మోయాల్సి వస్తుందని తెలిపాడు. అయితే బుమ్రా లేకున్నా భారత జట్టు మెరుగైన ప్రదర్శన చేయగలదని ధీమా వ్యక్తం చేశాడు. ఇక చివరి నిమిషంలో వెన్నుగాయంతో బుమ్రా, దీపక్ చాహర్లు జట్టుకు దూరం కాగా.. మహమ్మద్ షమీ జట్టులోకి వచ్చాడు. రిజ్వర్ ప్లేయర్గా ఉన్న దీపక్ చాహర్ స్థానాన్ని శార్దూల్ ఠాకూర్ భర్తీ చేయగా.. షమీకి బ్యాకప్గా సిరాజ్ ఆస్ట్రేలియాకు వెళ్లనున్నాడు.
రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నది. వెస్టర్న్ ఆస్ట్రేలియాతో ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన టీమిండియా.. గురువారం మరో మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో వామప్ మ్యాచ్లు ఆడుతుంది. ఈనెల 23న పాకిస్థాన్ పోరుతో భారత్ తమ ప్రపంచకప్ వేటను ప్రారంభించనుంది.