
పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022లో తొలి పరాజయాన్ని చవి చూసిన టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ వెన్ను గాయంతో జట్టుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. బంగ్లాదేశ్తో బుధవారం జరిగే మ్యాచ్లో అతను ఆడటం సందేహంగా మారింది. దినేశ్ కార్తీక్ గాయం గురించి బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. అతను తదుపరి మ్యాచ్ ఆడటం కష్టమేనని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్లో దినేశ్ కార్తీక్ కీపింగ్ చేస్తూ గాయపడ్డాడు.
బౌన్స్, పేస్కు అనుకూలిస్తున్న వికెట్పై భారత పేసర్లు చెలరేగడంతో వికెట్ కీపర్గా కార్తీక్ పలుమార్లు పైకి ఎగిరి బంతులను అందుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే చాలా ఎత్తులో వచ్చిన బంతిని అందుకునే ప్రయత్నం చేసిన కార్తీక్.. మోకాలిపై ల్యాండ్ అవ్వడంతో అతని పక్కటెముకలు పట్టేసాయి. ఫిజియో వచ్చి ప్రథమ చికిత్స చేసినా గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో కార్తీక్ మైదానం వీడాడు. 15వ ఓవర్ తర్వాత ఈ ఘటన చోటు చేసుకోగా.. రిషభ్ పంత్ అతని స్థానంలో కీపింగ్ చేశాడు.
అయితే అతని గాయం తీవ్రతపై స్పష్టం లేకున్నా.. తదుపరి మ్యాచ్కు కార్తీక్ అందుబాటులో ఉండే అవకాశం లేదని ప్రముఖ వార్త సంస్థ పీటీఐ తెలిపింది. మ్యాచ్ అనంతరం విలేకర్ల సమావేశంలో పాల్గొన్న భువనేశ్వర్ కుమార్ ముందు ఇదే విషయం ప్రస్తావించగా... కార్తీక్ గాయంపై క్లారిటీ లేదని చెప్పాడు. టీమ్ ఫిజియో అతని గాయాన్ని పరిశీలిస్తున్నారని, పెద్ద గాయం కాకుడదనే తాము కొరుకుంటున్నామని తెలిపాడు. తీవ్ర చలి ఉన్న పెర్త్ మైదానంలో పక్కటెముకలు పట్టేయడం సర్వసాధారణమని, కార్తీక్ విషయంలో అదే జరిగి ఉంటుందని చెప్పాడు.
దినేశ్ కార్తీక్ ఈ మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యాడు. సూర్యకుమార్ యాదవ్తో కలిసి 52 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన అతను 6 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటింగ్ అవకాశం వచ్చిన రెండు మ్యాచ్ల్లో విఫలమవ్వడంతో కార్తీక్ను పక్కనపెట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ గాయం సాకుగా చూపి అతన్ని పక్కనపెట్టే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.