
సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్థాన్ అద్భుత విజయాన్నందుకుంది. సౌతాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించి డక్వర్త్ లూయిస్ పద్దతిన 33 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మ్యాచ్ అనంతరం ఈ విజయంపై స్పందించిన బాబర్ ఆజామ్.. చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. వరుసగా మ్యాచ్లు ఓడటం తమకు తీవ్ర నష్టం చేసిందన్నాడు. కానీ రెండు పరాజయాల తర్వాత కూడా తాము చివరి రెండు మ్యాచ్ల్లో అద్భుతంగా ఆడామని తెలిపాడు. క్రికెట్ చాలా ఫన్నీ గేమ్ అని, ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేమని తమ సెమీస్ అవకాశాలను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్లో ప్రతీ ఒక్కరు మ్యాచ్ విన్నర్లేనని తెలిపాడు.
'మా జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా ఉంది. నేను, రిజ్వాన్ దారుణంగా విఫలమయ్యాం. మా స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాం. కానీ హారీస్ అసాధారణ బ్యాటింగ్తో మూమెంటమ్ను మావైపు మళ్లీంచాడు. ఆ తర్వాత షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ ఇన్నింగ్స్ను అద్భుతంగా ముగించారు. నిజాయితీగా చెప్పాలంటే పాకిస్థాన్ జట్టులో ప్రతీ ఒక్కరు గొప్ప ఆటగాడే. మ్యాచ్ విన్నరే. తొలి రెండు పరాజయాలు మా సెమీస్ అవకాశాలను దెబ్బతీసాయి. కానీ గత రెండు మ్యాచ్ల్లో మేం అద్భుతంగా ఆడి రేసులోకి వచ్చాం. క్రికెట్ చాలా ఫన్నీ గేమ్. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం'అని చెప్పుకొచ్చాడు.
వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ.. షాదాబ్ ఖాన్ (22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 52), ఇఫ్తికార్ అహ్మద్ (35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 51) అర్ధశతకాలతో ఆదుకున్నారు. ఈ ఇద్దరికి తోడుగా మహమ్మద్ హారిస్ (11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు 28), మహమ్మద్ నవాజ్ (22 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్తో 28) రాణించడంతో పాక్ భారీ స్కోర్ చేయగలిగింది. సౌతాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ నాలుగు వికెట్లు తీయగా.. పార్నెల్, రబడా, ఎంగిడి, షంసి తలో వికెట్ తీశారు.
వర్షం అంతరాయం కారణంగా సౌతాఫ్రికా లక్ష్యాన్ని 14 ఓవర్లలో 142 పరుగులుగా నిర్ణయించగా.. ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి 108 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. సఫారీ జట్టులో కెప్టెన్ టెంబా బవుమా(19 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 36), ఎయిడెన్ మార్క్రమ్(14 బంతుల్లో 4 ఫోర్లతో 20)మినహా అంతా విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది మూడు వికెట్లు తీయగా.. షాదాబ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. నసీమ్ షా, హరీస్ రౌఫ్, మహమ్మద్ వసీం తలో వికెట్ దక్కింది.