
మెల్బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ప్రారంభం కావాల్సిన మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. మెల్బోర్న్ వేదికగా షెడ్యూల్ ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ఆలస్యంగా మొదలవ్వనుంది. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో అంపైర్లు మ్యాచ్ను ప్రారంభించలేదు. ప్రస్తుతం వర్షం లేకున్నా.. మైదానాన్ని ఆరబెట్టేందుకు గ్రౌండ్స్మన్ శ్రమిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి పరిశీలించిన అంపైర్లు.. మరోసారి పరీక్షించి మ్యాచ్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. గ్రూప్-1లో ఉన్న ఈ రెండు జట్లు ఇప్పటికే ఒక్కో మ్యాచ్ ఓడిపోయాయి. న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్లోనే ఆస్ట్రేలియా 89 పరుగులతో చిత్తవ్వగా.. పసికూన ఐర్లాండ్.. ఇంగ్లండ్కు షాకిచ్చింది. దాంతో టోర్నీలో ముందడుగు వేయాలంటే ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి ఇరు జట్లకు వచ్చింది. టోర్నీ ఆరంభానికి ముందు ప్రతీ ఒక్కరు ఈ రెండు జట్లే టైటిల్ ఫేవరేట్ అని, ఫైనల్లో తలపడే అవకాశం ఉందని అంచనా వేసారు. కానీ ఈ రెండు జట్లు ఆ అంచనాలను అందుకోలేకపోయాయి.
న్యూజిలాండ్తో ఓడిన ఆస్ట్రేలియా.. శ్రీలంకపై గెలిచి బోణీ కొట్టింది. ఇక ఇంగ్లండ్.. అఫ్గానిస్థాన్ను ఓడించింది. గ్రూప్-1లో ఒక మ్యాచ్ గెలిచిన న్యూజిలాండ్.. మరో మ్యాచ్ రద్దవ్వడంతో మూడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఐర్లాండ్ కూడా న్యూజిలాండ్ తరహాలోనే మూడు పాయింట్లను ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో కొనసాగుతోంది. ఒకటి గెలిచి మరొకటి ఓడిన శ్రీలంక మెరుగైన రన్ రేట్ కారణంగా మూడో స్థానంలో ఉండగా.. ఒక్క విజయం నమోదు చేసిన ఇంగ్లండ్ నాలుగో స్థానంలో ఉంది. ఇక చిత్తుగా ఓడి దారుణమైన రన్రేట్ కలిగి ఉన్న ఆస్ట్రేలియా ఐదో స్థానంలో ఉంది. ఖాతా తెరవని అఫ్గాన్ ఆరో స్థానంలో నిలిచింది.
దాంతో ఆస్ట్రేలియా -ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్కు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకు సెమీస్ అవకాశాలు మెరుగవ్వనుండగా.. మరో జట్టు ఇంటి దారిపట్టనుంది. దాంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే మైదానంలో నేడు జరగాల్సిన అఫ్గాన్-ఐర్లాండ్ మ్యాచ్ బంతి పడకుండా తుడిచిపెట్టుకుపోయింది.