
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2022లో అనూహ్యంగా పాకిస్థాన్ సెమీఫైనల్ చేరడంతో.. ఫైనల్ మ్యాచ్ భారత్-పాక్ మధ్యనే జరగాలని క్రికెట్ అభిమానులంతా కోరుకుంటున్నారు. అప్పుడే అసలు సిసలు మజా లభిస్తుందని, చరిత్రలో నిలిచిపోయే మరో మ్యాచ్ జరుగుతుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. షేన్ వాట్సన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు సైతం దాయాది జట్ల మధ్యే ఫైనల్ మ్యాచ్ జరగాలని ఆకాంక్షించారు. సూపర్-12 పోరులో భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజాను అందించింది. అనేక మలుపులు తిరిగిన ఈ మ్యాచ్.. ఆఖరి బంతి వరకు ఉత్కంఠతను రేపింది. చివరి బంతి వరకు విజయం ఇరు జట్లను ఊరించింది.
చివరకు విరాట్ కోహ్లీ విరోచిత ఇన్నింగ్స్కు రవిచంద్రన్ అశ్విన్ స్మార్ట్ గేమ్ తోడవ్వడంతో గెలుపు టీమిండియాను వరించింది. క్రికెట్ చరిత్రలోనే ఓ గొప్ప మ్యాచ్గా ఇది నిలిచిపోయింది. ఈ క్రమంలోనే మరోసారి ఇలాంటి మ్యాచ్ను చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ మాత్రం తన అంచనాను భిన్నంగా చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్లో భారత్-న్యూజిలాండ్ తలపడతాయని, విజయం భారత్ను వరిస్తుందని జోస్యం చెప్పాడు.
ప్రస్తుతం భారత్లో ఉన్న ఏబీ డివిలియర్స్.. తాజాగా ఏఎన్ఐతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ప్రపంచకప్ సంబంధించిన తన అంచనాను వెల్లడించాడు. 'భారత్, న్యూజిలాండ్ ఫైనల్ ఆడనున్నాయి. నా అంచనా ప్రకారం భారత్ టైటిల్ గెలుస్తోంది. ఎందుకంటే టీమిండియాలో ప్రతీ ఒక్కరు అద్భుతంగా ఆడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ అయితే సూపర్ ఫామ్లో ఉన్నారు. రోహిత్ ఇప్పటి వరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చకపోయినా.. కీలక సెమీస్, ఫైనల్లో దుమ్మురేపుతాడు.
తన విలువ ఏంటో తెలియజేస్తాడు. భారత బ్యాటింగ్ లైనప్ చాలా బీకరంగా ఉంది. జట్టులో ఎంతో ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఉన్నారు. ఇంగ్లండ్తో జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. భారత్కు కఠిన ప్రత్యర్థి ఇంగ్లండే. సెమీస్లో ఆ జట్టు గెలిస్తే.. ప్రపంచకప్ను ముద్దాడినట్లే'అని డివిలియర్స్ పేర్కొన్నాడు.