
2022 టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా..
నాకౌటైనా చేరకుండానే ఈ ప్రపంచకప్ నుంచి వైదొలగడం బాధాకరమే. కానీ దాని గురించి ఆలోచించడం మానేసి ముందుకు సాగక తప్పదు. భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. తర్వాతి టీ20 ప్రపంచకప్కు ఎంతో సమయం లేదు. వచ్చే ఏడాదే ఆస్ట్రేలియా వేదికగా 2022 టీ20 ప్రపంచకప్ జరుగునుంది. ఆ టోర్నీలోనైనా ఆశించిన ఫలితం రాబట్టాలంటే.. టీమ్ ఇండియా సన్నద్ధత ఇప్పుటి నుంచే ఆరంభం కావాలి.
ఆ దిశగా జట్టు కూర్పు.. వ్యూహాలు.. ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఈ సారి జట్టు కూర్పు భారత్ను దెబ్బతీసింది. పాక్తో మ్యాచ్లో ఆరో బౌలర్ లేని లోటు కనిపించగా.. కివీస్తో పోరులో ఓపెనర్గా రాహుల్తో పాటు ఇషాన్ను పంపించి చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. జట్టులో ఏ ఆటగాడు ఏ బాధ్యతలు నిర్వర్తించాలి.. ఎవరు ఏ పాత్ర పోషించాలనే విషయంపై స్పష్టత ఉంటే ప్రదర్శన భిన్నంగా ఉంటుందనడంలో సందేహం లేదు. అలాంటి స్పష్టత ఎంత త్వరగా వస్తే జట్టుకు అంత మంచిది.

మరో ఆల్రౌండర్ అవసరం..
2019లో వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత నుంచి హార్దిక్ పాండ్య పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయడం లేదు. బ్యాటింగ్లో కూడా మునపటిలా రాణించడం లేదు. కాబట్టి భారత్ వీలైనంత త్వరగా మరో నికార్సైన పేస్ ఆల్రౌండర్ అన్వేషించాల్సిన అవసరముంది. వేగం, కచ్చితత్వంతో బౌలింగ్ చేయగలిగే ఫాస్ట్బౌలర్లనూ పట్టుకోవాలి. ఐపీఎల్లో సత్తా చాటిన వెంకటేశ్ అయ్యర్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిలా కనిపిస్తున్నాడు. అతన్ని మరింత మెరుగ్గా తయారు చేసుకుంటే జట్టుకు కలిసి వస్తుంది. భువనేశ్వర్ ఫామ్ లేమి.. కీలక మ్యాచ్ల్లో షమి రాణించలేకపోవడంతో భారం మొత్తం బుమ్రా మీదే పడుతోంది. ఈ నేపథ్యంలో అతనికి తోడుగా బంతితో మెరిసే పేసర్లు కావాలి.

లెఫ్టార్మ్ పేసర్ అవసరం..
ముఖ్యంగా బౌలింగ్లో వైవిధ్యంతో ప్రత్యర్థి బ్యాటర్లకు సవాలు విసిరే లెఫ్టార్మ్ పేసర్ లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. అలాంటి పేసర్ను జట్టులోకి తీసుకు రావడంపై మేనేజ్మెంట్ దృష్టి పెట్టాలి. ఇక స్పిన్నర్ల విషయంలోనూ స్పష్టత అవసరం. ఐపీఎల్ సందర్భంగా యూఏఈ పిచ్లపై మంచి పేస్ రాబట్టాడని చాహల్ను కాదని రాహుల్ చాహర్ను జట్టులోకి ఎంపిక చేశారు. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు. మిస్టరీ స్పిన్నర్గా ఎంపికైన వరుణ్ చక్రవర్తి ఆడిన మూడు మ్యాచ్ల్లో కలిపి ఒక్కటంటే ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ఈ టోర్నీలో లెగ్స్పిన్నర్లు ఆధిపత్యం చలాయిస్తుంటే వరుణ్ అసలేమాత్రం ప్రభావం చూపలేదు.

బీసీసీఐ సైతం..
ఇక మైదానం బయట విషయాల్లో జట్టు ప్రయోజనాల కోసం బీసీసీఐ ఆలోచించాలి. డబ్బుల కోసం కక్కుర్తి పడకుండా జట్టుకు కలిసొచ్చే పనులు చేయాలి. ఈ టోర్నీలో కాసుల కక్కుర్తి పడ్డ బీసీసీఐ.. పెద్ద మైదానంలో మ్యాచ్ నిర్వహించడమే కాకుండా రాత్రి వేళలో భారత మ్యాచ్లను షెడ్యూల్ చేసింది. ఇది భారత్ కొంప ముంచింది. అంతేకాకుండా ఐపీఎల్కు టీ20 ప్రపంచకప్ మధ్య గ్యాప్ లేకుండా టోర్నీని నిర్వహించింది. దాంతో సుదీర్ఘ కాలం పాటు కుటుంబాలకు దూరంగా ఉండడంతో ఆటగాళ్లపై ప్రభావం చూపింది.
జూన్లో ఇంగ్లండ్ పర్యటన మొదలు ఆరు నెలలుగా బబుల్లోనే టీమిండియా ఆటగాళ్లున్నారు. ప్రపంచకప్లో ఆటగాళ్ల వైఫల్యానికి బబుల్ అలసట కూడా ఓ కారణమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ప్రపంచకప్నకు ముందు ఆటగాళ్లు ఉత్సాహంగా, తాజాగా ఉండేలా జట్టు షెడ్యూల్ను రూపొందించడం ఎంతో ముఖ్యం.

కొత్త కోచ్, కెప్టెన్..
ఇక కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్, టీ20ల్లో కొత్త కెప్టెన్ జట్టుతో ఎంత త్వరగా కలిసిపోతారన్నది కూడా కీలకం. ఈ ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీకి కోహ్లీ గుడ్బై చెప్తానని ప్రకటించిన నేపథ్యంలో టీ20 ఫార్మాట్లో భారత జట్టును నడిపించే కొత్త సారథి ఎవరనే ఆసక్తి నెలకొంది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఇక అండర్-19, భారత్- ఎ జట్లకు కోచ్గా పని చేసిన ద్రవిడ్.. ఈ నెల 17న కివీస్తో ఆరంభమయ్యే సిరీస్ నుంచి టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్కు సిద్దమయ్యేందుకు రాహుల్ ద్రవిడ్, కొత్త కెప్టెన్కు మరీ ఎక్కువ సమయమేమీ లేదు. వీలైనంత త్వరగా టీమ్ కాంబినేషన్పై ఓ క్లారిటీకి రావాలి.


Click it and Unblock the Notifications












