
రోహిత్ చెప్పడంతోనే..
టీమ్ సెలెక్షన్ ముంగిట కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో చేతన్ శర్మ నేతృత్వంలోని భారత సెలెక్షన్ కమిటీ వర్చువల్గా సమావేశమైంది. ఈ సమావేవంలో అశ్విన్ గురించి సెలెక్షన్ కమిటీ అడగ్గా.. రోహిత్ అన్నీ సానుకూల అంశాలను చెప్పాడని సమాచారం. అంతేకాకుండా అశ్విన్ రాకతో జట్టు బలం పెరుగుతుందని, యూఏఈ పిచ్లపై అతను కీలకం అవుతాడని చెప్పాడట. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో సెలెక్షన్ కమిటీ అశ్విన్ ఎంపిక చేసిందని బీసీసీఐకి చెందిన ఓ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపాడు.

కోహ్లీ మాత్రం..
అయితే వాషింగ్టన్ సుందర్ అందుబాటులో లేకుంటేనే అశ్విన్ను తీసుకోవాలని కోహ్లీ సూచించాడట. వేలి గాయంతో సుందర్ టీ20 ప్రపంచకప్కు దూరమవడంతో అశ్విన్కు లైన్ క్లియరైందని సదరు అధికారి పేర్కొన్నాడు. సుందర్ స్థానాన్ని అశ్వినే భర్తీ చేయగలడని కెప్టెన్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, సెలెక్టర్లు భావించారని తెలిపాడు. ఈ సమావేశంలో ఇద్దరూ అశ్విన్ గురించి ఎక్కువగా మాట్లాడారని, గతేడాది ఐపీఎల్లో స్పిన్నర్ల పాత్ర ఎలా ఉందో వివరించారని చెప్పాడు. ముఖ్యంగా యూఏఈ మైదానాలు నెమ్మదిగా ఉంటాయని, అశ్విన్ బౌలింగ్ శైలికి అవి సరిగ్గా సరిపోతాయని, వేదికల పాయింట్ ఆఫ్ వ్యూలో అశ్విన్ జట్టుకు కీలకమవుతాడని చెప్పారన్నాడు.

హిట్ మ్యాన్కు ప్రాధాన్యత..
ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్ సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మకు ఇచ్చేందుకు బీసీసీఐ ఆసక్తికనబరుస్తుందని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. టీ 20 క్రికెట్లో ధోనీ.. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఎంపికపై ఎలాంటి ప్రభావం చూపుతాడో.. రోహిత్ ఎంపికలోని ముంబై ఇండియన్స్ కూడా అలాంటి ప్రభావాన్ని సృష్టిస్తుందని జట్టు వర్గాలు భావిస్తున్నాయన్నాడు. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్ టీమ్ సెలెక్షన్లో రోహిత్ శర్మ సలహాలు, సూచనలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, దాంతో ముంబై ఇండియన్స్కు చెందిన ఆటగాళ్లకే జట్టు అధిక ప్రాధాన్యత లభించిందని రాసుకొచ్చింది. ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, సూర్యకుమార్ యాదవ్లు జట్టులోకి వచ్చారని, శిఖర్ ధావన్, పృథ్వీ షా, సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్లు అవకాశం అందుకోలేకపోయారని పేర్కొంది.

అందుకే తీసుకున్నాం..
ఇక మెగాటోర్నీ కోసం భారత సెలెక్షన్ కమిటీ గత బుధవారం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఈ సందర్బంగా చేతన్ శర్మ మాట్లాడుతూ..అశ్విన్ లాంటి అనుభవజ్ఞుడు జట్టుకు అవసరమన్నాడు. ''అశ్విన్ జట్టుకు ఆస్తి. ఐపీఎల్లో రాణించాడు. జట్టుకు అతడిలాంటి అనుభవజ్ఞుడు అవసరం. వాషింగ్టన్ సుందర్ గాయపడడంతో మాకు ఆఫ్స్పిన్నర్ అవసరమయ్యాడు. జట్టులో అశ్విన్ ఒక్కడే ఆఫ్స్పిన్నర్'' అని అన్నాడు. హార్దిక్ పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడని చెప్పాడు. బౌలింగ్లో వేగం ఉండడం వల్లే చాహల్ను కాదని రాహుల్ చాహర్ను ఎంచుకున్నామని చేతన్ శర్మ తెలిపాడు. జడేజాకు బ్యాకప్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ జట్టులో స్థానం సంపాదించాడు. శ్రేయస్, శార్దూల్, దీపక్ చాహర్ స్టాండ్బైలుగా ఎంపికయ్యారు.


Click it and Unblock the Notifications
