దుబాయ్: అప్కమింగ్ టీ20 ప్రపంచకప్లో టీమిండియా ఎక్స్ట్రా సీమర్ను ఆడిస్తుందా? లేక స్నిన్నర్ను తీసుకుంటుందా? అనేది 'మంచు'(డ్యూ) నిర్ణయిస్తుందని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ప్లేయర్ల ఫామ్, రిథమ్ను తెలుసుకోవడమే రెండు వామప్ మ్యాచ్ల ముఖ్య ఉద్దేశమన్నాడు. ఇంగ్లండ్తో ప్రాక్టీస్ మ్యాచ్కు ముందు రవిశాస్త్రి అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడాడు. 'మ్యాచ్ సందర్భంగా మంచు ఎంత కురుస్తుంది. పరిస్థితులు ఎలా ఉంటాయి. బ్యాటింగ్, బౌలింగ్లో ఏది ఫస్ట్ తీసుకోవాలి. ఎక్స్ట్రా స్పిన్నర్ను ఆడించాలా? లేక సీమర్ను తీసుకోవాలా? అనేది అంచనా వేసుకుంటున్నాం. ఈ మొత్తం డ్యూ ప్రభావంపైనే ఆధారపడి ఉంటుంది.'అని శాస్త్రి పేర్కొన్నాడు. ఒకవేళ ముంచు ఎక్కువగా కురిస్తే స్పిన్నర్లకు బంతిపై పట్టు చిక్కడం చాలా కష్టంగా మారుతుంది. అప్పుడు బ్యాట్స్మెన్ చాలా సులువుగా షాట్లు ఆడతారు.
ఐపీఎల్లో ఆడటం వల్ల యూఏఈ మైదానాలపై భారత ఆటగాళ్లకు మంచి అవగాహన ఉందన్నాడు. 'మా ప్లేయర్లందరూ రెండు నెలలుగా ఐపీఎల్ ఆడారు. కాబట్టి ఎక్కువ ప్రిపరేషన్ అవసరం లేదు. కేవలం అప్పటి పరిస్థితులకు అలవాటు పడితే చాలు. రిథమ్ బాగుంటే సరిపోతుంది. ప్రాక్టీస్ మ్యాచ్లో అందరూ బ్యాటింగ్, బౌలింగ్ చేయవచ్చు. కాబట్టి కాంబినేషన్ను సరి చూసుకుంటాం'అని హెడ్ కోచ్ వ్యాఖ్యానించాడు.
ఇప్పటికే టీ20 ప్రపంచకప్ క్వాలిఫైర్ మ్యాచులు ప్రారంభమవ్వగా.. ప్రధాన జట్లన్నీ ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతున్నాయి. ఇంగ్లండ్తో జరిగిన సన్నాహక మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందగా.. న్యూజిలాండ్పై ఆసీస్, వెస్టిండీస్పై పాకిస్థాన్ గెలుపొందాయి. ఇక అక్టోబర్ 23 నుంచి టోర్నీ సూపర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. పొట్టి ప్రపంచకప్లో భాగంగా అబుదాబిలో జరగబోయే తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్తో మ్యాచ్ అనంతరం అక్టోబర్ 31న న్యూజిలాండ్తో, నవంబర్ 3న ఆఫ్గనిస్తాన్తో భారత్ ఆడనుంది. ఆ తర్వాత క్వాలిఫయర్లో గెలిచిన జట్లతో మరో రెండు మ్యాచులు కోహ్లీసేన తలపడనుంది. ఈ రెండు మ్యాచులు నవంబర్ 5, 8 తేదీల్లో జరగనున్నాయి. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లను భారత్ ఓడిస్తే.. సునాయాసంగా తదుపరి రౌండ్ చేరుకుంటుంది.