
షార్జా: నమీబియా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్లో తొలిసారి పోటీపడ్డ ఆ జట్టు.. సూపర్-12 రౌండ్కు కూడా అర్హత సాధించింది. తొలి రౌండ్ గ్రూప్-ఎలో భాగంగా శుక్రవారం జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్లో నబీబియా 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్పై ఉత్కంఠ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 128 పరుగులు చేసింది. ఓపెనర్లు స్టిర్లింగ్(38), కెవిన్ ఒబ్రెయిన్(25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. నమీబియా బౌలర్లలో జాన్ ఫ్రీలింగ్(3/21), వీస్(2/22) ప్రత్యర్థిని కట్టడి చేశారు. అనంతరం కెప్టెన్ గెరార్ట్ ఎరాస్కన్(53 నాటౌట్), డేవిడ్ వీస్(28 నాటౌట్) పోరాటంతో నమీబియా 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 126 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.
తాము సూపర్ 12కు అర్హత సాధించామని తెలియగానే ఆటగాళ్లు ఆనందలో మునిగిపోయారు. విన్నింగ్ షాట్ ఆడిన డేవిడ్ వీస్ మైదానంలో గట్టిగా అరుస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేయగా.. నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్న గెర్హాడ్ ఎరాస్మస్ మొకాళ్లపై కూర్చొని సంబరాలు చేసుకున్నాడు. వీస్ వచ్చి అతనికి హగ్ ఇచ్చాడు. ఇక డగౌట్లో ఉన్న నమీబియా ఆటగాళ్లు సంబరాలు షురూ అయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
ఇక 2019లో టీ20ల్లోకి అరంగేట్రం చేసిన నమీబియా.. 25 మ్యాచ్ల అనంతరమే టీ20 ప్రపంచకప్ సూపర్-12కు అర్హత సాధించడం గమనార్హం. 1993లో ఐసీసీలో అసోసియేట్ మెంబర్గా సభ్యత్వం పొందిన నమీబియా తొలిసారి 2003 ప్రపంచకప్లో పాల్గొంది. ఆ టోర్నీలో నమీబియాతో భారత్ తలపడగా.. సచిన్, గంగూలీ సెంచరీలతో చెలరేగారు.
గ్రూప్-ఎ నుంచి ఇప్పటికే సూపర్-12కు అర్హత సాధించిన శ్రీలంక తమ ఆఖరి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్ను చిత్తు చేసి హ్యాట్రిక్ విక్టరీతో గ్రూప్ టాపర్గా ముందంజ వేసింది. లంక బౌలర్ల దెబ్బకు నెదర్లాండ్స్ 10 ఓవర్లలో 44 రన్స్కే కుప్పకూలింది. వానిందుహసరంగ(3/9), లాహిరు కుమార(3/7), మహేశ్ తీక్షణ(2/3) చెలరేగారు. అనంతరం లంక 7.1 ఓవర్లలో రెండు వికెట్లకు 45 రన్స్ చేసి సులువుగా గెలుపొందింది. గ్రూప్-ఏలో టాపర్గా లంక సూపర్ 12లో ఆసీస్, ఇంగ్లండ్ ఉన్న గ్రూప్-1కు చేరింది. రెండో ప్లేస్తో నమీబియా.. భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్తో కూడిన గ్రూప్-2లోకి వచ్చింది.