దుబాయ్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆదివారం భారత జట్టుతో కలిసాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ను చాంపియన్గా నిలబెట్టిన మహీ.. ఇప్పుడు భారత జట్టుకు టీ20 ప్రపంచకప్ అందించే పనిలోపడ్డాడు. టీ20 ప్రపంచకప్ కోసం భారత నియంత్రణ క్రికెట్ మండలి(బీసీసీఐ) ధోనీని టీమిండియా మెంటార్గా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం జట్టుతో చేరిన మహీ.. తన పనిని మొదలుపెట్టాడు.
టీమిండియా ప్రాక్టీస్ శిభిరంలో పాల్గొని ఆటగాళ్ల సన్నాహకాలను పరిశీలించాడు. హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్లతో సుదీర్ఘంగా చర్చించాడు. వీటికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్ వేదికగా పంచుకుంది. 'కొత్త పాత్రలో భారత జట్టులోకి వచ్చిన కింగ్ మహేంద్ర సింగ్ ధోనీకి సాదర స్వాగతం.'అని బీసీసీఐ క్యాప్షన్గా పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
Extending a very warm welcome to the KING 👑@msdhoni is back with #TeamIndia and in a new role!💪 pic.twitter.com/Ew5PylMdRy
— BCCI (@BCCI) October 17, 2021
ఇక ఇదే యూఏఈ గడ్డపై గతేడాది దారుణంగా విఫలమై లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన చెన్నై సూపర్ కింగ్స్ను మహేంద్ర సింగ్ ధోనీ తనదైన సారథ్యంలో చాంపియన్గా నిలబెట్టాడు. ముందుగా గతేడాది తప్పులను సరిదిద్దిన మహీ.. సూపర్ కాంబినేషన్తో వరుస విజయాలందించాడు. ప్లే ఆఫ్స్ ముందు వరుస పరాజయాలు ఎదురైన ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా అండగా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన క్వాలిఫయర్-1లో పాత ధోనీని తలపిస్తూ తనదైన హిట్టింగ్తో మ్యాచ్ను ముగించాడు. ఫైనల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా కేకేఆర్ను చిత్తు చేసి నాలుగో సారి టైటిల్ను ముద్దాడాడు.
ఫైనల్ అనంతరం వచ్చే సీజన్ ఆడుతావా? అని ప్రశ్నించగా.. అది బీసీసీఐ రిటెన్షన్ పాలసీపైనే ఆధారపడి ఉందని మహీ చెప్పాడు. లీగ్లోకి కొత్తగా రెండు జట్లు వస్తున్న నేపథ్యంలో మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ధోనీని ఎట్టిపరిస్థితుల్లో వదులుకోమని చెప్పింది. ప్లేయర్ తొలి రిటెన్షన్ కార్డును మహీ కోసమే వాడతామని ఆ ఫ్రాంచైజీకి చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నాడు.
'రిటెన్షన్ పాలసీ ఉండటం ఖాయం. అయితే ఎంతమందిని రిటైన్ చేసుకోవచ్చనే అంశంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. నిజానికి ధోనీ విషయంలో మాకు వేరే ఆలోచన లేదు. తొలి రిటైనింగ్ కార్డును మహీ కోసమే వాడతాం. మా జట్టుకు మహీ కెప్టెన్సీ చాలా అవసరం. వచ్చే ఏడాది మహీ మాతోనే ఉంటాడు'అని సదరు అధికారి స్పష్టం చేశాడు.