
దుబాయ్: టీ20 ప్రపంచకప్లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో న్యూజిలాండ్ అదరగొట్టింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియాకు దిమ్మతిరిగే షాకిచ్చి టోర్నీలో ముందడుగేసింది. పక్కా ప్లాన్తో పర్ఫెక్ట్ బౌలింగ్తో, కట్టుదిట్టమైన ఫీల్డింగ్తో, ఖతర్నాక్ బ్యాటింగ్తో కోహ్లీసేనను ఓడించిన న్యూజిలాండ్ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఆదివారం జరిగిన గ్రూప్-బి పోరులో కివీస్ 8 వికెట్ల తేడాతో భారత్ను చిత్తు చేసింది. అయితే ప్రణాళికలకు తగ్గట్లు ఆడి ఫలితం సాధించామని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తెలిపాడు. విజయానంతరం మాట్లాడిన కేన్ మామ.. భారత్పై ఒత్తిడి పెంచి విజయం సాధించామన్నాడు.
'సరైన ప్రణాళికలతో బరిలోకి దిగాం. భారత్ లాంటి అత్యుత్తమ జట్టుపై గెలవడం సంతోషంగా ఉంది. వారిపై ఒత్తిడి పెంచి గెలవాలనుకున్నాం. అదే చేశాం. ఇది సమష్టి విజయం. ఇష్ సోధి చాలా బాగా బౌలింగ్ చేశాడు. అతడు ఎన్నోసార్లు జట్టును గెలిపించాడు. బ్యాటింగ్లో మా ఓపెనర్లు చెలరేగి గెలుపునకు చేరువగా తెచ్చారు.'అని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 110 పరుగులు చేసింది. జడేజా (19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ 26 నాటౌట్)నే భారత ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్. తర్వాత న్యూజిలాండ్ 14.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసి జయభేరి మోగించింది. ఓపెనర్ డారిల్ మిచెల్ (35 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్లు) చెలరేగగా.. విలియమ్సన్ (31 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు) అజేయంగా నిలబడి మ్యాచ్ ముగించాడు.
ఈ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి. హ్యాట్రిక్ విక్టరీలతో గ్రూప్2 టాపర్ పాకిస్థాన్ సెమీస్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకోగా.. పాయింట్ల ఖాతానే తెరవని భారత్(-1.61 రన్రేట్) ఐదో ప్లేస్లో ఉంది. మిగిలిన మ్యాచ్ల్లో చిన్న జట్టు అఫ్గానిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాపై గెలిచినా మనోళ్లు సెమీస్ చేరడం కష్టమే. ఎందుకంటే ఈ మూడు టీమ్స్తోనే తలపడనున్న న్యూజిలాండ్ రెండింటిలో ఓడాలి, అది అసాధ్యమే అనొచ్చు. ఒక మ్యాచ్లో ఓడినా ప్లస్ రన్రేట్(0.76)తో కివీస్ ముందంజ వేసే చాన్సుంది. కాబట్టి భారత్ సెమీస్ చేరాలంటే అద్భుతం జరగాల్సిందే.