
హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ ముందు భారత అభిమానులను ఓ సెంటిమెంట్ ఊరిస్తోంది. ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే భారత్ టైటిల్ గెలవడం ఖాయం. కనీసం ఫైనల్ అన్నా చేరుతుంది. అదేంటంటే.. పసికూన జట్లు అయిన నమీబియా, స్కాట్లాండ్ సూపర్-12కు అర్హత సాధించడం. ఆ జట్లు క్వాలిఫై అయితే భారత్కు వచ్చేదేం ఉందంటారా? గతంలో ఆ జట్టుతో తలపడినప్పుడు భారత్ ఫైనల్ చేరింది. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం పాకిస్థాన్తో జరిగే ఫస్ట్ మ్యాచ్తో భారత్ తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది. టీ20 ప్రపంచకప్ క్వాలిఫికేషన్ మ్యాచ్లు ముగియడంతో నేటి(శనివారం) నుంచి అసలు సిసలు సమరానికి తెరలేవనుంది. ఫస్ట్ రౌండ్ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్లతో పాటు స్కాట్లాండ్, నమీబియా జట్లు సూపర్ 12కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. గ్రూప్-ఏలో టాపర్గా నిలిచిన శ్రీలంక సూపర్ 12లో ఆసీస్, ఇంగ్లండ్ ఉన్న గ్రూప్-1కు చేరింది. రెండో ప్లేస్తో నమీబియా.. భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్తో కూడిన గ్రూప్-2లోకి వచ్చింది. గ్రూప్-బిలో టాపర్గా నిలిచిన స్కాట్లాండ్.. భారత్ ఉన్న గ్రూప్-2లోకి రాగా.. సెకండ్ ప్లేస్లో ఉన్న బంగ్లాదేశ్ గ్రూప్-1కు చేరింది.
ఇక భారత్.. లీగ్ దశలో పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్తో పాటు స్కాట్లాండ్, నమీబియాలతో తలపడనుంది. అయితే లీగ్ దశలో ఈ రెండు జట్లతో తలపడినప్పుడు భారత్ ఫైనల్ చేరింది. 2003 వన్డే ప్రపంచకప్లో నమీబియాతో ఆడిన భారత్.. 181 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్(152), సౌరవ్ గంగూలీ(112) సెంచరీలతో రాణించారు. ఆ టోర్నీల్లో ఫైనల్ చేసిన భారత్.. ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ సారి మళ్లీ నమీబియాతో ఆడే అవకాశం రావడంతో భారత్ ఫైనల్ చేరడం ఖాయమని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
ఇక 2007 టీ20 ప్రపంచకప్లో భారత్.. స్కాట్లాండ్తో తలపడాల్సి వచ్చింది. అయితే ఆ మ్యాచ్ వర్షంతో బంతి పడకుండా రద్దవ్వడంతో భారత్ తమ తదుపరి మ్యాచ్ పాక్తో ఆడాల్సి వచ్చింది. పాక్ను బౌల్ ఔట్ పద్దతిలో ఓడించిన భారత్ ఫైనల్ చేరింది. ఫైనల్లో కూడా పాక్ను ఓడించి తొలి టైటిల్ను ముద్దాడింది. ఈసారి కూడా పాక్తో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న భారత్ మళ్లీ అదే ఫలితాన్ని పునరావృతం చేస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్గా తొలి అడుగు వేసాడని.. ఇప్పుడు మెంటార్గా సేవలందిస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. కోచ్గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్న మహీకి మెంటార్గా ఇది తొలి అడుగేనని అభిప్రాయపడుతున్నారు.