
దుబాయ్: టీ20 ప్రపంచకప్ ప్రైజ్మనీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. విజేతగా నిలిచే జట్టుకు రూ.12 కోట్ల (1.6 మిలియన్ అమెరికన్ డాలర్లు) ప్రైజ్మనీ లభించినుంది. రన్నరప్ జట్టుకు అందులో సగం రూ.6 కోట్లు(0.8 మిలియన్ డాలర్లు) అందుకోనుంది. ఇక సెమీఫైనలిస్ట్ టీమ్స్ రూ. 3 కోట్ల(0.4 మిలియన్ అమెరికన్ డాలర్లు) చొప్పున గెలుచుకోనున్నాయి
రౌండ్-2లో గెలిచే జట్లకు ఒక్క మ్యాచ్కు రూ. 30 లక్షల నగదుపురస్కారం లభించనుంది. రౌండ్ 2 ఎగ్జిట్లో ఒక్కో జట్టుకు రూ.52.59 లక్షలు, రౌండ్1లో గెలిచిన జట్టుకు రూ.30 లక్షల క్యాష్ ప్రైజ్ లభించనుంది. ఈ మేరకు ఐసీసీ ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేసింది.
డెసిషన్ రివ్యూ సిస్టమ్(డీఆర్ఎస్) విషయంలోను ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీ20 ప్రపంచకప్ టోర్నీలో డీఆర్ఎస్ను అమలు చేయనున్నట్లు తెలిపింది. అయితే టీ20 ప్రపంచకప్లో డీఆర్ఎస్ వాడటం ఇదే తొలిసారి. సాధారణంగా టీ20 మ్యాచ్ల్లో ఇరు జట్లకు ప్రతీ ఇన్నింగ్స్లో ఒక రివ్యూ కోరే అవకాశం ఉంటుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా టోర్నీలో తక్కువ అనుభవం ఉన్న అంపైర్లు పనిచేసే అవకాశం ఉన్నందున అదనంగా ఇరు జట్లకు మరో రివ్యూను ఇవ్వనున్నట్లు తెలిపింది. తాజా రూల్స్ ప్రకారం మ్యాచ్లో ఇరు జట్లకు రెండు ఇన్నింగ్స్లోనూ రెండు రివ్యూలు కోరే అవకాశం ఉంటుంది.
డక్వర్త్ లూయిస్ పద్దతి ఆధారంగా వచ్చే ఫలితాల నిర్ణయాల్లోనూ ఐసీసీ కీలక మార్పులు చేసింది. టీ20 ప్రపంచకప్లో లీగ్ దశలో ఏవైనా మ్యాచ్లకు వర్షం అంతరాయం కలిగిస్తే.. డక్వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితం తేల్చాలంటే ఇకపై ప్రతీ జట్టు కనీసం ఐదు ఓవర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అదే నాకౌట్ మ్యాచ్ల్లో మాత్రం 10 ఓవర్లు పాటు బ్యాటింగ్ చేస్తేనే డక్వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితం తేల్చేందుకు వీలుంటుంది.