అబుదాబి: న్యూజిలాండ్తో హోరాహోరీగా సాగిన టీ20 ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నందుకుంది. చివరి మూడు బంతుల్లో 8 పరుగులు కావాల్సిన తరుణంలో జోష్ ఇంగ్లిస్ (8 నాటౌట్).. జేమిసన్ వరుసగా వేసిన రెండు బంతుల్ని ఫోర్లుగా మలిచి ఆసీస్ను విజయ తీరాలకు చేర్చాడు. దాంతో 159 పరుగుల లక్ష్యాన్ని ఒక బంతి ఉండగానే ఆసీస్ ఛేదించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది.
ఓపెనర్లు గప్టిల్ (30), డారిల్ మిచెల్( 33).. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (37), జిమ్మీ నీషమ్ (31 ) రాణించగా.. డెవాన్ కాన్వే(12), గ్లేన్ ఫిలిప్స్(2), విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కేన్ రిచర్డ్సన్(3/24) మూడు వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా రెండు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్, అష్టన్ అగర్లకు తలో వికెట్ దక్కింది.
అనంతరం 159 పరుగుల లక్ష్యచేధనకు దిగిన ఆసీస్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కే డేవిడ్ వార్నర్ గోల్డ్న్ డక్గా వెనుదిరిగాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్(24), మిచెల్ మార్ష్(24), స్టీవ్ స్మిత్(35), మార్కస్ స్టోయినిస్ (28), అష్టన్ అగర్(23) పర్వాలేదనిపించగా.. మాథ్యూ వేడ్(0) విఫలమయ్యాడు. చివర్లో అష్టన్ అగర్ ఔటైనా.. మిచెల్ స్టార్క్(13 నాటౌట్)తో కలిసి జెమీసన్(8 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 13 రన్స్ అవసరం కాగా.. జెమీసన్ వేసిన ఫస్ట్ బాల్ను బౌండరీకి తరలించిన స్టార్క్.. మరుసటి బాల్ను సింగిల్ తీసాడు. మూడో బంతికి అగర్ను ఔట్ చేయడంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. చివరి మూడు బంతుల్లో 8 పరుగులు అవసరమయ్యాయి. అయితే క్రీజులోకి వచ్చిన ఇంగ్లీస్ వరుసగా రెండు బౌండరీలు బాది మరో బంతి మిగిలుండగానే విజయాన్నందించాడు.
న్యూజిలాండ్:
20 ఓవర్లలో 158/7 (విలియమ్సన్ 37, రిచర్డ్సన్ 3/24, జంపా 2/17);
ఆస్ట్రేలియా:
20 ఓవర్లలో 159/7 (స్మిత్ 35, స్టొయినిస్ 28, శాంట్నర్ 3/22).