
దుబాయ్ : ఈ ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సోమవారం స్పష్టత ఇవ్వనుంది. ఆ రోజు జరిగే వర్చువల్ సమావేశంలో ఈ మెగా టోర్నీ నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పొట్టి ప్రపంచకప్ను నిర్వహించలేమని ఆతిథ్య ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. అయినా ఐసీసీ మాత్రం ఆ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవడంలేదు.
మరోవైపు ఈ మెగాటోర్నీ వాయిదా పడితే ఆ అక్టోబర్-సెప్టెంబర్ విండోలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఐసీసీ మాత్రం ఈ విషయంపై స్పష్టత ఇవ్వకుండా నాన్చుతుంది. ముఖ్యంగా శశాంక్ మనోహార్ ఛైర్మన్గా ఉన్నన్ని రోజులూ ఈ విషయంపై ఆసక్తి చూపలేదు. ఎలాగైనా టీ20 ప్రపంచకప్ను నిర్వహించాలనే పట్టుదలతో కనిపించింది.
ఇప్పుడు ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకోవడంతో రేపు జరగబోయే సమావేశంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే వీలుంది. అదే సమయంలో తదుపరి ఛైర్మన్ పదవికి నామినేషన్ల ప్రక్రియపై చర్చించే అవకాశం ఉంది. అత్యున్నత పదవి నుంచి మనోహర్ తప్పుకున్నాక ఇంగ్లండ్ మాజీ ఛైర్మన్ కొలిన్ గ్రేవ్ ఆ పదవిపై కన్నేశాడు. మరోవైపు ఆ పోటీలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేరు కూడా వినిపిస్తుంది. అయితే దాదా మాత్రం ఆ పదవి చేపట్టేందుకు తనకు తొందరలేదన్నాడు.