టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్పై దుమారం రేగుతోంది. ఈ క్యాచ్ మ్యాచ్ ఫలితాన్ని శాసించడంతో కొందరు అభిమానులు వివాదాస్పదం చేసే ప్రయత్నం చేశారు. ఈ క్యాచ్ అందుకునే క్రమంలో సూర్య బౌండరీ లైన్ తాకాడని ఆరోపించారు.
బౌండరీ రోప్ కదలడం వీడియోలో కనిపిస్తుందని కామెంట్ చేశారు. అంతేకాకుండా ఉద్దేశపూర్వంగా బౌండరీ లైన్ జరిపారని, తెల్లని లైన్ ఇందుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఆరోపణలపై అధికారిక బ్రాడ్కాస్టర్ వివరణ ఇచ్చింది. సూర్య పట్టింది క్లియర్ క్యాచ్ అని స్పష్టం చేసింది.

పిచ్ మారడంతోనే..
బౌండరీ లైన్ జరిపారనే ఆరోపణలపై స్పందిస్తూ.. మైదానంలో పిచ్ మారినప్పుడు అందుకు తగ్గట్లు బౌండరీ లైన్స్ను అడ్జస్ట్ చేయడమ సహజమని పేర్కొంది. గత మ్యాచ్లో బౌండరీ లైన్ ముందుకు ఉందని, ఫైనల్లో పిచ్ మారడంతో బౌండరీ లైన్ను అడ్జస్ట్ చేయడంతో వైట్ లైన్ మార్క్ కనిపిస్తుందని వివరణ ఇచ్చింది.
క్యాచ్ అందుకునే క్రమంలో సూర్య బౌండరీ లైన్ కూడా తాకలేదని స్పష్టం చేసింది. అవగాహన లేకుండా మాట్లాడుతూ.. వివాదాస్పదమని చేయవద్దని సూచించింది.
అనవసర రాద్దాంతం..
సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం షాన్ పొలాక్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 'సూర్యకుమార్ అందుకున్న అద్భుతమైన క్యాచ్ పై గత రెండు రోజులుగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ క్యాచ్ పై ఇంత రాద్ధాంతం అవసరం లేదు. సూర్యకుమార్ అసాధారణ రీతిలో ఆ క్యాచ్ను పూర్తి చేశాడు. బౌండరీ లైన్కు సూర్య ఏ మాత్రం తాకలేదు.
క్యాచ్ అందుకునే క్రమంలో సూర్య తనకు తాను సమన్వయం చేసుకున్న తీరు అద్భుతం. సూర్యది క్లియర్ క్యాచ్. దీనిపై చర్చ అనవసరం.'అని షాన్ పొలాక్ స్పష్టం చేశాడు.
మలుపు తిప్పిన క్యాచ్..
శనివారం ఉత్కంఠగా సాగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో గెలిచి టైటిల్ను ముద్దాడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో సూర్య స్టన్నింగ్ క్యాచ్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఆఖరి ఓవర్లో ఫుల్టాస్గా వేసిన తొలి బంతిని డేవిడ్ మిల్లర్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు.
దాదాపు సిక్సర్గా దూసుకెళ్లిన ఈ బంతిని సూర్య బౌండరీ లైన్పై చాకచక్యంగా అందుకున్నాడు. ముందుగా సిక్సర్ను అడ్డుకొన్న సూర్య, తర్వాత సమన్వయం కోల్పోవడంతో బంతి గాల్లోకి విసిరేసాడు. బౌండరీ రోప్ దాటి, మళ్లీ మైదానంలోకి వచ్చి బంతిని అందుకున్నాడు. ఈ క్యాచ్ మ్యాచ్ను మలుపు తిప్పింది. అది సిక్సర్గా మారినా.. మిల్లర్ నాటౌట్గా తేలినా ఫలితం భారత్కు ప్రతికూలంగా ఉండేది.