ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా భారత్తో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్లో వెస్టిండీస్ 196 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. రోస్టన్ ఛేజ్(25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 40), రోవ్మన్ పోవెల్(19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 34 నాటౌట్), జాసన్ హోల్డర్(22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 37 నాటౌట్) దూకుడు ఆడారు.
దాంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. కెప్టెన్ షైహోప్(33 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 32), షిమ్రాన్ హెట్మైర్(12 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 27) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(2/36) రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు. ఫీల్డింగ్లో టీమిండియా తీవ్రంగా నిరాశపర్చింది. మూడు క్యాచ్లను నేలపాలు చేయడంతో పాటు రెండు రనౌట్ అవకాశాలను చేజార్చుకుంది.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్కు ఆశించిన ఆరంభం దక్కింది. ఓపెనర్లు రోస్టన్ ఛేజ్, షై హోప్(32) శుభారంభాన్ని అందించారు. భారత ఫీల్డర్ల తప్పిదాలు కూడా ఈ జోడీకి కలిసొచ్చింది. అర్ష్దీప్ సింగ్ వేసిన మూడో ఓవర్ రెండో బంతికే ఛేజ్ రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వరుణ్ చక్రవర్తీ బంతిని కీపర్ వైపు అందించడంలో విఫలమయ్యాడు. అతను సరిగ్గా బంతిని అందించి ఉంటే ఛేజ్ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు.
ఈ అవకాశంతో అతను చెలరేగాడు. బుమ్రా వేసిన ఐదో ఓవర్ ఐదో బంతికి రోస్టన్ ఛేజ్ ఇచ్చిన సునాయస క్యాచ్ను ఎక్స్ట్రా కవర్స్లో అభిషేక్ శర్మ నేలపాలు చేశాడు. ఈ క్యాచ్ పట్టి ఉంటే రోస్టన్ ఛేజ్ 19 పరుగులకే పెవిలియన్ చేరేవాడు. ఈ రెండు అవకాశాలతో అతను చెలరేగడంతో పవర్ ప్లేలో వెస్టిండీస్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. ఈ జోడీని ఎట్టకేలకు వరుణ్ చక్రవర్తీ విడదీసాడు. షైహోప్(32)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
క్రీజులోకి వచ్చిన హెట్మైర్ రెండు భారీ సిక్స్లతో దూకుడు కనబర్చాడు. అయితే జస్ప్రీత్ బుమ్రా హెట్మైర్తో పాటు రోస్టన్ ఛేజ్ను ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చి బ్రేక్ త్రూ అందించాడు. రూథర్ఫోర్డ్ను హార్దిక్ పాండ్యా ఔట్ చేయడంతో విండీస్ 119 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రోవ్మన్ పోవెల్, జాసన్ హోల్డర్ సంచలన బ్యాటింగ్తో అదిరిపోయే భాగస్వామ్యాన్ని అందించారు. అర్ష్దీప్ సింగ్ వేసిన 19వ ఓవర్లో రోవమన్ పోవెల్ ఇచ్చిన క్యాచ్ను అభిషేక్ శర్మ వదిలేసాడు. ఈ మ్యాచ్లో అతను రెండు క్యాచ్లు నేలపాలు చేయడం గమనార్హం. ఈ ఓవర్లో అర్ష్దీప్ సింగ్ 6 పరుగులే ఇవ్వగా.. బుమ్రా వేసిన ఆఖరి ఓవర్లో జాసన్ హోల్డర్ సిక్స్, పోవెల్ ఓ బౌండరీ బాది 14 పరుగులు పిండుకున్నారు. దాంతో విండీస్ 195 పరుగుల మార్క్ అందుకుంది.