టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అండగా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో జడేజా పేలవ ఫామ్ కొనసాగిస్తున్నా.. అతన్ని తుది జట్టులో కొనసాగించాలని టీమిండియాకు సూచించాడు. అసలు అతన్ని నిందించాల్సిన అవసరమే లేదన్నాడు.
టీ0 ప్రపంచకప్ 2024లో జడేజా దారుణంగా విఫలమవుతున్నాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లోనూ తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన జడేజా.. 16 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లో 7.80 ఎకానమీతో ఒకే ఒక్క వికెట్ తీసాడు. ఈ క్రమంలోనే అతన్ని తుది జట్టు నుంచి తప్పించి స్పెషలిస్ట్ బ్యాటర్ లేదా బౌలర్ను తీసుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.

అయితే సునీల్ గవాస్కర్ మాత్రం జడేజాను తుది జట్టులోనే కొనసాగించాలన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్లో విఫలమైనా.. ఫీల్డర్గా జడేజాకు తిరుగులేదని చెప్పాడు. క్లిష్ట పరిస్థితుల్లో సత్తా చాటే సామర్థ్యం అతనికి ఉందని తెలిపాడు. 'రవీంద్ర జడేజా పేలవ ఫామ్ గురించి నాకు ఎలాంటి ఆందోళన లేదు. ఇప్పటి వరకు అతనికి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు.
అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అంతేకాకుండా అతను అసాధారణ ఫీల్డర్. తన ఫీల్డింగ్ స్కిల్తో 20-30 పరుగులు అడ్డుకుంటాడు. అసాధారణమైన క్యాచ్లు అందుకోవడంతో పాటు కళ్లు చెదిరే రనౌట్స్ చేస్తాడు. కాబట్టి అతని ఫీల్డింగ్ సామర్థ్యాన్ని మరిచిపోకూడదు. బ్యాటింగ్, బౌలింగ్లో అతను రాణిస్తే టీమిండియాకు అదనపు అడ్వాంటేజ్. కాబట్టి రవీంద్ర జడేజాను ప్రశ్నించాల్సిన అవసరం లేదు.
అసలు సమస్య అంతా భారత అభిమానులతోనే. రెండు మ్యాచ్ల్లో విఫలమైతే.. అతను జట్టులో ఎందుకు? అని ప్రశ్నిస్తారు. ఇలా అడిగేవారంతా వారి ప్రొఫెషన్స్లో తమకు తాము ప్రశ్నించుకోవాలి. ఇలానే రెండు తప్పిదాలు చేస్తే తమ ప్రొఫెషన్స్ నుంచి తప్పుకుంటామా? అని ఆలోచించుకోవాలి. ఏ ప్రొఫెషన్లోనైనా ఒకటి రెండు వైఫల్యాలకే నిందించడం సరికాదు. జడేజాను కూడా తుది జట్టు నుంచి తప్పించాలని కూడా డిమాండ్ చేయడం సరికాదు.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియాపై అద్భుత విజయంతో సెమీఫైనల్ చేరిన టీమిండియా.. గురువారం ఇంగ్లండ్తో రెండో సెమీఫైనల్లో తలపడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే శనివారం జరిగే ఫైనల్కు అర్హత సాధిస్తోంది.