టీ20 ప్రపంచకప్ 2024లో సౌతాఫ్రికా జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్-8లో భాగంగా ఇంగ్లండ్తో శుక్రవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సౌతాఫ్రికా 7 పరుగుల తేడాతో గెలుపొందింది. సూపర్-8 పోరులో వరుసగా రెండో మ్యాచ్ గెలిచి సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ క్వింటన్ డికాక్ ( 38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 65) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. డేవిడ్ మిల్లర్ ( 28 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 43) విలువైన పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ (3/40) మూడు వికెట్లు తీయగా.. మోయిన్ అలీ, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్(37 బంతుల్లో 7 ఫోర్లతో 53), లియామ్ లివింగ్స్టోన్(17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 33) పోరాడినా ఫలితం లేకపోయింది.
చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 14 పరుగులు అవసరమవ్వగా.. క్రీజులో సెట్ అయిన హ్యారీ బ్రూక్ ఉండటంతో విజయం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అతను భారీ షాట్కు ప్రయత్నించగా.. మార్క్రమ్ వెనక్కి పరుగెత్తుతూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత సామ్ కరన్ పోరాడినా ఫలితం లేకపోయింది.
ఈ ఉత్కంఠ పోరులో విజయం సాధించడంతో సౌతాఫ్రికా క్రికెటర్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో విజయం దక్కడంతో కసిగా సంబరాలు చేసుకున్నారు. డ్రెస్సింగ్ రూమ్లో గట్టిగా అరుస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.