టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇవ్వడాన్ని మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తప్పుబట్టాడు. ఈ అవార్డుకు కోహ్లీ అనర్హుడని అభిప్రాయపడ్డాడు. అసలు ఈ మ్యాచ్ ఉత్కంఠగా మారడానికి కోహ్లీ జిడ్డు బ్యాటింగే కారణమని అభిప్రాయపడ్డాడు.
అతని స్లో బ్యాటింగ్తోనే హార్దిక్ పాండ్యా వంటి బిగ్ హిట్టర్కు బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదన్నాడు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీని బౌలర్లే కాపాడారని తెలిపాడు. ఫైనల్లో టీమిండియా ఓడిపోయి ఉంటే విరాట్ కోహ్లీ తీవ్ర విమర్శలు ఎదుర్కొనేవాడని, విలన్లా చూసేవారని చెప్పుకొచ్చాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ కోహ్లీకి బదులు బౌలర్లకు ఇవ్వాల్సిందని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.

హాఫ్ సెంచరీతో..
సౌతాఫ్రికాతో గత శనివారం(జూన్ 29) ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాప్-3 బ్యాటర్లు విఫలమైన వేళ అక్షర్ పటేల్తో కలిసి విరాట్ కోహ్లీ జట్టును ఆదుకున్నాడు. కాస్త నెమ్మదిగా ఆడిన కోహ్లీ 76 పరుగులతో జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు.
క్రీజులో చివరి వరకు ఉండాలని టీమ్మేనేజ్మెంట్ ఆదేశించడంతోనే కోహ్లీ అలా స్లోగా బ్యాటింగ్ చేశాడని మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
బౌలర్లే గెలిపించారు..
అయితే ఈ నిర్ణయాన్ని సంజయ్ మంజ్రేకర్ తప్పుబట్టాడు. 'టీమిండియా బ్యాటింగ్ బాగుంది. కానీ కోహ్లీ నెమ్మదైన బ్యాటింగ్ వల్లే టీమిండియా ఉత్కంఠ పరిస్థితులను ఎదుర్కొంది. బౌలర్లే అతన్ని కాపాడారు. నా అభిప్రాయం ప్రకారం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ బౌలర్కు ఇవ్వాల్సింది. ఎందుకంటే వాళ్లే టీమిండియాను గెలిపించారు.
కోహ్లీ స్లో బ్యాటింగ్ కారణంగా బిగ్ హిట్టర్ అయిన హార్దిక్ పాండ్యాకు రెండు బంతులు మాత్రమే ఆడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోతే విరాట్ కోహ్లీ తీవ్ర విమర్శలు ఎదుర్కొనేవాడు'అని జడేజా చెప్పుకొచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలను జింబాబ్వే మాజీ క్రికెటర్ ఆండీ ఫ్లవర్ తప్పుబట్టాడు. టీమిండియా నమోదు చేసిన 176 పరుగుల లక్ష్యం చాలా పెద్దదని చెప్పుకొచ్చాడు. కోహ్లీ రాణించకుంటే టీమిండియా ఆ స్కోర్ చేసేది కాదన్నాడు.