టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా బాల్ టాంపరింగ్ చేస్తుందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ చేసిన సంచలన ఆరోపణలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఘాటుగా స్పందించాడు. ఈ పనికిమాలిన ఆరోపణలు చేసే ముందు కాస్త బుర్రను వాడాలని చురకలంటించాడు.
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో టీమిండియా స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ బాల్ టాంపరింగ్ చేశాడని, దాంతో అసాధారణమైన రివర్స్ స్వింగ్ రాబట్టాడని ఇంజమామ్ ఉల్ హక్ ఆరోపించిన విషయం తెలిసిందే. అంపైర్లు కాస్త కళ్లు తెరిచి చూడాలని ఈ పాక్ మాజీ క్రికెటర్ విమర్శలు గుప్పించాడు.

సాధారణంగా బంతి పాతబడిన తర్వాత రివర్స్ అవుతుందని, కానీ కొత్త బంతితోనే అర్ష్దీప్ సింగ్ రివర్స్ స్వింగ్ రాబడుతున్నాడని ఇంజమామ్ ఉల్ హక్ అన్నాడు. బంతి ఆకారాన్ని దెబ్బతీసే అర్ష్దీప్ సింగ్ రివర్స్ స్వింగ్ చేయగలగుతున్నాడని సందేహం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో అంపైర్లు కాస్త అలర్ట్గా ఉండాలని సూచించాడు.
తాజాగా ఈ ఆరోపణలను రోహిత్ శర్మ ముందు ప్రస్తావించగా అసహనం వ్యక్తం చేశాడు. కాస్త బుర్రను ఉపయోగించాలని చురకలంటించాడు. 'ఈ ప్రశ్నకు నేను ఏమని సమాధానం ఇవ్వాలి. సూర్యుడి కింద మండుటెండలో పొడిగా ఉన్న వికెట్పై ఆడుతున్నప్పుడు బంతి దానంతట అదే రివర్స్ స్వింగ్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్కే కాకుండా అన్ని జట్లకు రివర్స్ అవుతుంది.
కొన్నిసార్లు కాస్త బుర్రను ఉపయోగించాలి. మేం ఎక్కడ ఆడుతున్నామనే విషయాన్ని కూడా గుర్తించాలి. బంతి రివర్స్ కాకపోవడానికి మేం ఏం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో ఆడటం లేదు.'అని రోహిత్ శర్మ ఘాటుగా బదులిచ్చాడు.
గ్రూప్ దశలో అమెరికా, పాకిస్థాన్, ఐర్లాండ్ను మట్టికరిపించిన టీమిండియా.. సూపర్-8లో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు అర్హత సాధించింది. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది.
గత టీ20 ప్రపంచకప్ 2024లోనూ భారత్, ఇంగ్లండ్ జట్లు సెమీఫైనల్లోనే తలపడ్డాయి. 10 వికెట్లతో టీమిండియాను ఓడించి ఫైనల్ చేరిన ఇంగ్లండ్.. పాకిస్థాన్పై గెలిచి టైటిల్ను అందుకుంది.
డిఫెండింగ్ ఛాంపియన్గా తాజా ఎడిషన్లో అడుగుపెట్టిన ఇంగ్లండ్ తడబడుతూనే సెమీస్ చేరింది. ఈ క్రమంలోనే సెమీఫైనల్-2లో టీమిండియా.. హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. అయితే 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా మరో ఐసీసీ టైటిల్ గెలవలేదు. నాకౌట్ మ్యాచ్ల్లో ఓటమిపాలై తృటిలో టైటిల్ను అందుకోలేకపోయింది.