సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఈ టోర్నీలో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన రోహిత్ శర్మ.. కీలక మ్యాచ్లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. సౌతాఫ్రికా వ్యూహాన్ని పసిగట్టలేక 5 బంతుల్లో 9 పరుగులే చేసి ఔటయ్యాడు.
మార్కో జాన్సెన్ వేసిన తొలి ఓవర్లో విరాట్ కోహ్లీ మూడు బౌండరీలు బాది 15 పరుగులు పిండుకున్నాడు. దాంతో వ్యూహం మార్చిన మార్క్రమ్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ను పట్టుకొచ్చి ఫలితాన్ని రాబట్టాడు. కేశవ్ మహారాజ్ బౌలింగ్లో వరుసగా రెండు బౌండరీలు బాదిన రోహిత్.. నాలుగో బంతికి క్యాచ్ ఔటయ్యాడు. బ్యాక్వర్ స్క్వేర్ లెగ్లో ఫీల్డర్ను పెట్టి రోహిత్ శర్మకు మార్క్రమ్ ఉచ్చు బిగించాడు.

ఈ వ్యూహాన్ని పసిగట్టలేకపోయిన రోహిత్..మహారాజా వేసిన ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ను స్వీప్ షాట్ ఆడాడు. బ్యాట్కు మంచి టైమింగ్ అయిన ఈ బంతి బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ ఫీల్డర్ క్లాసెన్ చేతిలోకి దూసుకొచ్చింది. లో-గా వచ్చిన ఈ క్యాచ్ను కొంచెం ఎడమ వైపు జరిగి క్లాసెన్ అద్భుతంగా అందుకున్నాడు. దాంతో రోహిత్ తీవ్రంగా నిరాశపరిచాడు.
క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్.. ఈ ఓవర్ చివరి బంతికే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. స్వీప్ షాట్ ఆడబోయి కీపర్ చేతికి చిక్కాడు. ఆ కొద్ది సేపటికే రబడా వేసిన 5వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్(3) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ మ్యాచ్లో విఫలమవడంతో రోహిత్ శర్మ ఈ టోర్నీని 257 పరుగులతో ముగించాడు. 8 మ్యాచ్ల్లో 40 సగటు, 155 స్ట్రైక్రేట్తో రోహిత్.. రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.