టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ రికార్డ్ను విరాట్ కోహ్లీ సమం చేశాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా సౌతాఫ్రికాతో శనివారం జరిగిన ఫైనల్లో విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 76) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ కోహ్లీకి ఇది 39వ హాఫ్ సెంచరీ. అంతర్జాతీయ టీ20ల్లో బాబర్ ఆజామ్ కూడా 39 హాఫ్ సెంచరీలే నమోదు చేశాడు. ఈ ఇద్దరి తర్వాత రోహిత్ శర్మ 37 హాఫ్ సెంచరీలతో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. మహమ్మద్ రిజ్వాన్(30), డేవిడ్ వార్నర్(29) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో విరాట్ కోహ్లీ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత జట్టును విరాట్ కోహ్లీ.. అక్షర్ పటేల్తో కలిసి ఆదుకున్నాడు. ఆచితూచి ఆడిన విరాట్ కోహ్లీ క్విక్ సింగిల్స్తో ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. మరో ఎండ్లో అక్షర్ పటేల్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
ఈ ఇద్దరూ నాలుగో వికెట్కు 72 పరుగులు జోడించారు. అక్షర్ పటేల్(31 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 47)తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. 48 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. చివర్లో శివమ్ దూబే(16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 27) సాయంతో దూకుడుగా ఆడిన కోహ్లీ జట్టుకు 176 పరుగుల పోరాడే లక్ష్యాన్ని అందించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్(2/23), అన్రిచ్ నోర్కియా(2/26) రెండేసి వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, కగిసో రబడా తలో వికెట్ తీసారు.