టీమిండియాపై ఆస్ట్రేలియా మీడియా మరోసారి విషం చిమ్మింది. టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ విజయాన్ని తక్కువ చేస్తూ తమ అక్కసు వెళ్లగక్కింది. ఇతర అంతర్జాతీయ మీడియా సంస్థలు టీమిండియా విజయాన్ని ప్రశంసిస్తూ కథనాలు రాస్తే.. ఆసీస్ మీడియా మాత్రం సౌతాఫ్రికా వైఫల్యంతో విజయం సాధించిందని రాసుకొచ్చింది.
'సౌతాఫ్రికా తడబాటే టీ20 ప్రపంచకప్ 2024లో భారత జట్టును విజేతగా నిలబెట్టింది.'అనే క్యాప్షన్తో ఓ కథనాన్ని ప్రచురించింది. 'ఈ ప్రపంచకప్లో భారత జట్టుకి అన్ని కలిసొచ్చాయి. ఫైనల్లో సౌతాఫ్రికా విఫలమవడంతో పాటు అంపైర్ల నిర్ణయాలు భారత జట్టును గెలిపించాయి.'అని ఆసీస్ మీడియా తమ కథనంలో రాసుకొచ్చింది. ఫైనల్ చేరిన తర్వాత కూడా ఆసీస్ మీడియా ఇలానే విషం చిమ్మింది.

ఐసీసీ అండదండలతో అనుకూలమైన షెడ్యూల్తో ఫైనల్ చేరిందని విమర్శలు గుప్పించింది. పాకిస్థాన్తో పాటు బ్రిటీష్ మీడియా మాత్రం భారత్ విజయాన్ని కొనియాడాయి. తీవ్ర ఒత్తిడిలోనూ.. భారత జట్టు సమిష్టిగా రాణించి, అద్భుత విజయంతో టైటిల్ను సొంతం చేసుకుందని అంతర్జాతీయ మీడియా కొనియాడాయి.
పాకిస్థాన్కు చెందిన డాన్ పత్రిక... భారత విజయోత్సవాలకు సంబంధించిన ఫోటోని ఫ్రంట్ పేజీలో ప్రచురించింది. భారత్ అసాధారణ విజయం సాధించిందని పేర్కొంటూ.. ఈ విజయంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడని కొనియాడింది. లండన్లోని సండే టైమ్స్.. గేరు మార్చి భారత్కు కప్పు అందించిన కోహ్లీ అంటూ ఓ కథనంలో పేర్కొంది. కీలక మ్యాచ్లో చేతులెత్తేసే పరంపరని సౌతాఫ్రికా మరోసారి కొనసాగించిందని ప్రస్తావించింది.