టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు మరోసారి నిరాశే మిగిలింది. 9 రోజుల వ్యవధిలోనే అయ్యర్ మరో ఫైనల్లో పరాజయాన్ని చవిచూసాడు. ముంబై టీ20 ప్రీమియర్ లీగ్లో భాగంగా గురువారం జరిగిన ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తున్న సోబో ముంబై ఫాల్కన్స్ జట్టు ఓటమిపాలైంది. అద్భుత ప్రదర్శన కనబర్చిన ముంబై సౌత్ సెంట్రల్ మరాఠ రాయల్స్ జట్టు టైటిల్ సొంతం చేసుకుంది. ఫైనల్లో 5 వికెట్ల తేడాతో ముంబై ఫాల్కన్స్ జట్టును ఓడించింది.
ఈ నెల 3న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్లోనూ శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించిన పంజాబ్ కింగ్స్ 6 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పంజాబ్ కింగ్స్ను ఫైనల్ చేర్చిన శ్రేయస్ అయ్యర్ తృటిలో టైటిల్ చేజార్చుకున్నాడు. తాజాగా ముంబై ప్రీమియర్ లీగ్లోనూ అతనికి నిరాశే ఎదురైంది.

తాజా ఫైనల్లోనూ శ్రేయస్ అయ్యర్(17 బంతుల్లో 12) తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 157 పరుగులే చేసింది. మయురెష్ తండెల్(32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 50 నాటౌట్), హర్ష్ అగవ్(28 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 45 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
అనంతరం ముంబై సౌత్ సెంట్రల్ మరాఠ రాయల్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు చేసి గెలుపొందింది. చిన్మయ్ రాజేష్ సుతార్(49 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 53), అవైస్ ఖాన్ నౌషధ్(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38) రాణించారు. కీలక ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ విఫలమవ్వడం ఆయా జట్ల విజయవకాశాలను దెబ్బతీస్తోంది. ఆర్సీబీతో జరిగిన ఫైనల్లో శ్రేయస్ అయ్యర్(1) తీవ్రంగా నిరాశపర్చాడు.
శ్రేయస్ అయ్యర్కు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని డిమాండ్ వ్యక్తమవుతున్న క్రమంలో అతను సారథ్యం వహించిన జట్లు వరుసగా రెండు ఫైనల్స్లో ఓడిపోవడం చర్చనీయాంశంగా మారింది.