ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియాకప్ 2024 టోర్నీలో భారత్-ఏ పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. అసాధారణ ప్రదర్శనతో నాకౌట్ చేరిన తిలక్ వర్మ సారథ్యంలోని భారత్-ఏ.. శుక్రవారం అఫ్గానిస్థాన్-ఏతో జరిగిన సెమీఫైనల్-2లో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో సమష్టిగా రాణించిన అఫ్గానిస్థాన్ 20 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్-ఏ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. అఫ్గాన్ ఓపెనర్లు సెదిఖుల్లా అటల్(52 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 83), జుబైద్ అక్బారీ(41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 64) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగాడు.

కరీమ్ జనత్(20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 41) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో రసిక్ సలామ్(3/25) మూడు వికెట్లు తీయగా.. ఆకిబ్ ఖాన్(1/48) ఒక వికెట్ పడగొట్టాడు.
ఈ మ్యాచ్లో అఫ్గాన్ బ్యాటర్లు భారత బౌలర్లను చెడుగుడు ఆడారు. ఓపెనర్లు సెదిఖుల్లా అటల్(52 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 83), జుబైద్ అక్బారీ(41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 64) తొలి వికెట్కు 137 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. తర్వాతి బ్యాటర్లు కూడా అదే జోరు కొనసాగించి భారీ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్-ఏ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులే చేసి ఓటమిపాలైంది. రమణ్దీప్ సింగ్(34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 64) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. ఆయుష్ బదోని(24 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 31) పర్వాలేదనిపించాడు. భారీ లక్ష్యచేధనలో ధాటిగా ఆడాలనే ఆలోచనతో బ్యాటింగ్ చేసిన భారత కుర్రాళ్లు ఒత్తిడిని అధిగమించలేక వికెట్లు పారేసుకున్నారు. అభిషేక్ శర్మ(7), కెప్టెన్ తిలక్ వర్మ(16) దారుణంగా విఫలమయ్యారు.
దూకుడుగా ఆడిన నెహాల్ వధేరా(20), నిశాంత్ సింధు(23) దురదృష్టవశాత్తు రనౌటయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో గజన్ఫర్, అబ్దుల్ రెహ్మాన్ రెండేసి వికెట్లు తీయగా.. షెరాఫుద్దీన్ అష్రఫ్ తలో వికెట్ తీసారు. ఆదివారం జరిగే ఫైనల్లో శ్రీలంక-ఏతో అఫ్గాన్-ఏ తలపడనుంది. పాకిస్థాన్తో జరిగిన తొలి సెమీఫైనల్లో శ్రీలంక విజయం సాధించింది.