మాటల్లో చెప్పలేను..
'వన్డేల్లో అవకాశం వస్తుందని అసలు ఊహించలేదు. జట్టులో ఉన్నానని చెప్పినప్పుడు ఒత్తిడికి లోనయ్యా, అలానే ఆడా. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నా. మొత్తంగా ఆడటమేగాక వికెట్లు సాధించా. భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. ఇదంతా కలలా ఉంది. కోచ్, ఆటగాళ్లు ఎంతో మద్దతుగా నిలిచారు. స్ఫూర్తినిచ్చారు. చక్కని ప్రదర్శన చేశానంటే వాళ్లే కారణం. ఇక విరాట్ కోహ్లీ, అజింక్యా రహానె ఎంతో ప్రోత్సహించారు. వాళ్ల సారథ్యంలో ఆడినందుకు చాలా ఆనందంగా ఉంది'అని నటరాజన్ తెలిపాడు.
లెఫ్టార్మ్ పేసర్ కావడంతోనే..
తాను ఎడమ చేతి వాటం బౌలర్ను కావడంతోనే మూడు ఫార్మాట్లలో అవకాశం దక్కిందని నటరాజన్ చెప్పుకొచ్చాడు. 'భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బౌలర్లలో ఎక్కువ మంది కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. నేను ఎడమ చేతి వాటం బౌలర్ని కావడంతో నాకు మూడు ఫార్మాట్లలో అవకాశం దక్కింది. నెట్స్లో నేను శ్రమించడాన్ని కోచ్, కెప్టెన్లు గుర్తించారు. నా బౌలింగ్పై పూర్తి నమ్మకంతో మూడు ఫార్మట్లలో ఆడే అవకాశాన్ని కల్పించారు. కేవలం ఎడమ చేతి వాటం బౌలర్ను కావడం వల్లే నాకు అవకాశాలు దక్కాయి. నేను నాకు అప్పజెప్పిన పనిని సరిగ్గ చేయాలనుకున్నా.'అని నటరాజన్ చెప్పుకొచ్చాడు.
ఎంతో రుణ పడి ఉన్నా..
తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన సేలం క్రికెట్ అసోసియేషన్కు తానెంతో రుణపడి ఉన్నానని, భవిష్యత్తులో సేలం క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని నట్టూ హామీ ఇచ్చాడు. ఇక ఆసీస్ పర్యటనను ముగించుకొని స్వస్థలం వచ్చిన నటరాజన్కు అభిమానులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. రథంలో ఊరేగింపు నిర్వహించారు. దారి పోడవునా తమ అభిమాన క్రికెటర్పై పూల వర్షం కురిపించారు.
ఊహించని అవకాశాలు..
ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి వన్డేతో నటరాజన్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ను మొదలుపెట్టాడు. ఈ మ్యాచ్లో భారత్ 13 పరుగుల తేడాతో గెలిచింది. పది ఓవర్లు వేసిన అతడు 70 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అనంతరం పొట్టిఫార్మాట్లోనూ చోటు సంపాదించి భారత్ టీ20 సిరీస్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక సిరీస్లో ఆఖరిదైన గబ్బా టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్లోనూ అరంగేట్రం చేసి మూడు వికెట్లతో సత్తాచాటాడు.