జైపూర్: దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో హైదరాబాద్ శుభారంభం చేసింది. మేఘాలయతో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.
అంతర్జాతీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శనతో కెప్టెన్గా ప్రమోషన్ అందుకున్న తిలక్ వర్మ.. సారథిగా తొలి విజయాన్ని అందుకున్నాడు. సూపర్ కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్లోనూ సత్తా చాటాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసి మేఘాలయ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 119 పరుగులే చేసింది. లారీ సంగ్మా(40 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్ 46), అమైంగ్షూ సెన్(27 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. హైదరాబాద్ బౌలర్లలో రవి తేజ(3/16) మూడు వికెట్లు తీయగా.. చామ మిలింద్, అనికేత్ రెడ్డి తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన హైదరాబాద్ 13.2 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 120 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. తన్మయ్ అగర్వాల్(33 బంతుల్లో 6 ఫోర్లతో 46 నాటౌట్), తిలక్ వర్మ(31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 41 నాటౌట్) రాణించారు. రోహిత్ రాయుడు(16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 26) పర్వాలేదనిపించాడు.
ఇటీవలే ముగిసిన ఆసియా గేమ్స్లో తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని టీమిండియా బంగారు పతకం సాధించింది. ఈ ప్రదర్శనతో హైదరాబాద్ కెప్టెన్సీ అందుకున్న తిలక్ వర్మ.. భవిష్యత్తులో టీమిండియా కీలక ప్లేయర్గా ఎదగనున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ అతని కెరీర్లో కీలకం కానుంది. ఆ టోర్నీలో అతను సత్తా చాటితే వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్లో అతను బరిలోకి దిగనున్నాడు.