ఆదుకున్న సోలంకి:
టాస్ గెలిచి తమిళనాడు ఫీల్డింగ్ ఎంచుకోగా.. తొలుత బరోడా బ్యాటింగ్కు దిగింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ మణిమారన్ సిద్దార్థ్ (4/20) విజృంభించడంతో బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒక దశలో 36 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. 50 పరుగులైనా చేస్తుందా అన్న సందేహాలు కలిగాయి. అయితే ఆల్రౌండర్ అతీత్ సేథ్ (29)తో కలిసి విష్ణు సోలంకి (49; 55 బంతుల్లో 1×4, 2×6) జట్టును ఆదుకుని పోరాడే స్కోరు అందించాడు. ఈ జోడీ ఏడో వికెట్కు 58 పరుగులు జోడించింది. ఆఖరి ఓవర్ ఐదో బంతికి సోలంకి రనౌట్ కావడంతో ఒక్క పరుగుతో అర్ధ సెంచరీ కోల్పోయాడు. చివరి నాలుగు ఓవర్లలో బరోడా 49 పరుగులు సాధించింది. నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన తమిళనాడు మ్యాచ్లో తొలి 13 ఓవర్లను వారితోనే వేయించడం విశేషం.
చెలరేగిన అపరాజిత్, కార్తీక్:
స్వల్ప ఛేదనను తమిళనాడు ఆడుతూ పాడుతూ ముగించింది. ఓపెనర్ జగదీషన్ (14) నాలుగో ఓవర్లో వెనుదిరిగినా మరో ఓపెనర్ హరి నిషాంత్ (35) మాత్రం బౌండరీలతో కదం తొక్కాడు. దీంతో పది ఓవర్లలో 61/1 స్కోరుతో జట్టు పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఈ దశలో చక్కగా కుదురుకున్న నిషాంత్ను పేసర్ బాబాషఫీ ఔట్ చేశాడు. మధ్య ఓవర్లలో కెప్టెన్ కార్తీక్ (22), అపరాజిత్ (29 నాటౌట్) సింగిల్స్పై దృష్టి పెట్టారు. ఇక చివరి 30 బంతుల్లో 32 పరుగులు అవసరమైన దశలో కార్తీక్ 16వ ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు. కానీ మరుసటి ఓవర్లోనే పేలవ షాట్తో క్యాచ్ అవుటయ్యాడు. అప్పటికి ఇంకా 20 పరుగులు కావాల్సి ఉండగా.. బాబా అపరాజిత్ ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాట్ ఝుళిపించాడు. 18వ ఓవర్లో వరుసగా 6, 4 బాది మరో రెండు ఓవర్లుండగానే మ్యాచ్ను ముగించాడు.
స్టార్ ఆటగాళ్లు దూరమైనా:
ప్రముఖ ఆటగాళ్లు జట్టుకు దూరమైనా తమిళనాడు అదరగొట్టింది. టీమిండియా విధుల్లో బిజీగా ఉన్న ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, టీ నటరాజన్, సందీప్ వారియర్ (నెట్ బౌలర్) జట్టుకు అందుబాటులో లేరు. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా, ఆల్రౌండర్ విజయ్ శంకర్ పెళ్లి వల్ల ఆడలేకపోయారు. అయినా సీనియర్ ప్లేయర్ దినేశ్ కార్తీక్ సారథ్యంలోని తమిళనాడు సత్తాచాటింది. గతేడాది ఫైనల్లో అందినట్టే అంది చేజారిన టైటిల్ను ఈసారి పట్టేసింది. ఈ ఏడాది టోర్నీ మొత్తం అజేయంగా నిలిచి విజేతగా అవతరించింది. ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోకుండా తమిళనాడు, బరోడా ఫైనల్ చేరగా.. తుది పోరులో తమిళనాడుదే పైచేయిగా నిలిచింది.

సంక్షిప్త స్కోర్లు:
బరోడా: 20 ఓవర్లలో 120/9 (విష్ణు సొలాంకి 49, అతిత్ సేత్ 29; ఎం సిద్ధార్థ్ 4/20).
తమిళనాడు: 18 ఓవర్లలో 123/3 (హరి నిశాంత్ 35, బాబా అపరాజిత్ 29 నాటౌట్; అతిత్ 1/20, షరీఫ్ 1/23)
అభిమానులకు శుభవార్త.. మొతేరా స్టేడియంలోకి ప్రేక్షకులకు అనుమతి! ప్రధానికి ఆహ్వానం!


Click it and Unblock the Notifications












