
ఢిల్లీ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని మరోసారి తమిళనాడు ఎగరేసుకుపోయింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన విజయ్ శంకర్ నేతృత్వంలోని తమిళనాడు వరుసగా రెండో ఏడాది కూడా విజేతగా నిలిచింది. కర్ణాటకతో సోమవారం జరిగిన ఉత్కంఠ ఫైనల్లో ఆఖరి బంతికి విజయాన్నందుకుంది. చివరి బంతికి 5 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆ జట్టు విధ్వంసకర బ్యాట్స్మన్ షారూఖ్ ఖాన్ సూపర్ సిక్స్తో గెలుపుతో పాటు టైటిల్ అందించాడు. ఇక విజయం ఖాయమనుకున్న మనీశ్ పాండే నేతృత్వంలోని కర్ణాటకకు మరోసారి నిరాశే మిగిలింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 రన్స్ చేసింది.
కెప్టెన్ మనీశ్ పాండే(13) విఫలమైనా.. అభినయ్ మనోహర్(37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 46), ప్రవీణ్ దుబే(25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 33) రాణించారు. చివర్లో జగదీష్ సుచిత్(7 బంతుల్లో ఫోర్, సిక్స్తో 18) మెరుపులు మెరిపించాడు. తమిళనాడు బౌలర్లలో రవి శ్రీనివాస్ సాయికిషోర్ మూడు వికెట్లు తీయగా.. సంజయ్ యాదవ్, టీ నటరాజన్, సందీప్ వారియర్ తలో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన తమిళనాడు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసి థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. ఓపెనర్లు హరి నిషాంత్(12 బంతుల్లో ఫోర్, రెండు సిక్స్లతో 23), నారయణ్ జగదీషన్(46 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 41) శుభారంభం అందించగా.. షారూఖ్ ఖాన్(15 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 33 నాటౌట్) హార్డ్ హిట్టింగ్తో అద్భుత విజయాన్నందించాడు.
ఆఖరి ఓవర్లో తమిళనాడు విజయానికి 16 పరుగులు అవసరమవ్వగా.. ప్రతీక్ జైన్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతిని సాయి కిషోర్ బౌండరీ కొట్టగా.. తర్వాత మూడు సింగిల్స్, రెండు వైడ్లతో పాటు క్విక్ డబుల్ తీశాడు. దాంతో చివరి బంతికి ఐదు పరుగులు అవసరమయ్యాయి. అయితే షారూఖ్ ఖాన్ భారీ సిక్స్ కొట్టి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. కర్ణాటక బౌలర్లలో కేసీ కరియప్ప రెండు, ప్రతీక్ జైన్, విద్యధర్ పాటిల్, కరుణ్ నాయర్ తలో వికెట్ తీశారు.