టీ20 క్రికెట్లో టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ జోరు కొనసాగుతోంది. సౌతాఫ్రికా గడ్డపై వరుసగా రెండు శతకాలు నమోదు చేసిన ఈ హైదరాబాద్ బ్యాటర్.. ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. తొలి మ్యాచ్లోనే శతకం బాది పొట్టి ఫార్మాట్లోనే హ్యాట్రిక్ సెంచరీలు బాదిన తొలి బ్యాటర్గా తిలక్ వర్మ చరిత్రకెక్కిన విషయం తెలిసిందే.
ఈ టోర్నీలో హైదరాబాద్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న తిలక్ వర్మ.. మేఘాలయతో జరిగిన తొలి మ్యాచ్లో 151 పరుగులతో చెలరేగాడు. బెంగాల్తో జరిగిన తదుపరి మ్యాచ్లో 57 పరుగులతో రాణించాడు. రాజస్థాన్తో 13 పరుగులే చేసి విఫలమైన తిలక్ వర్మ.. బిహార్తో తాజాగా జరిగిన మ్యాచ్లో అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు.

సౌతాఫ్రికా గడ్డపై అందుకున్న ఫామ్ను కొనసాగిస్తున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్తో ఐపీఎల్ 2025 సీజన్కు ముందు ప్రత్యర్థి జట్లను హెచ్చరిస్తున్నాడు. తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ రూ.8 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. బిహార్తో తాజాగా జరిగిన మ్యాచ్లోనూ హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బిహార్.. నిర్ణీత 20 ఓవరల్లో 9 వికెట్లకు 118 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో రవి తేజ(4/26) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. సీవీ మిలింద్, అజయ్ దేవ్ గౌడ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. నితిన్ సాయి యాదవ్కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం హైదరాబాద్ 12.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 119 పరుగులు చేసి ఘన విజయాన్నందుకుంది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్(8) విఫలమైనా.. రోహిత్ రాయుడు(33 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 56 నాటౌట్), తిలక్ వర్మ(31 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 51 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ టోర్నీలో గ్రూప్-ఏలో ఉన్న హైదరాబాద్.. 4 మ్యాచ్లకు రెండు గెలిచి రెండు ఓడి నాలుగో స్థానంలో కొనసాగుతోంది.