
కోల్కతా: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు బోణీ కొట్టింది. ఫస్ట్ మ్యాచ్లో అస్సాం చేతిలో ఎదురైన ఓటమి నుంచి జట్టు వెంటనే తేరుకుంది. మంగళవారం జరిగిన గ్రూప్-బి సెకండ్ మ్యాచ్లో తన్మయ్ అగర్వాల్ కెప్టెన్సీలోని హైదరాబాద్ 6 రన్స్ తేడాతో ఒడిశాపై ఉత్కంఠ విజయం సాధించింది. ఈ గెలుపుతో నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 రన్స్ చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్మన్ తిలక్ వర్మ (35 బంతుల్లో 3 ఫోర్లతో 44), కెప్టెన్ తన్మయ్(30 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 34) రాణించారు. అనంతరం ఒడిశా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 రన్స్కే పరిమితమై ఓటమిపాలైంది.
గోవింద పొడ్డార్(50), కెప్టెన్ సుబ్రాన్షు(43 నాటౌట్) సత్తా చాటినా జట్టును గెలిపించలేకపోయారు. హైదరాబాద్ బౌలర్లలో టీ. రవితేజ(2/40), సీవీ మిలింద్(2/24) చెరో రెండు వికెట్లతో రాణించారు. గురువారం జరిగే తమ తర్వాతి మ్యాచ్లో బెంగాల్తో హైదరాబాద్ పోటీ పడనుంది.