అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత పురుషుల సెలెక్షన్ కమిటీ ద్వంద వైఖరిపై టీమిండియా మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణి ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్టార్ ఆటగాళ్లకు ఒక రూల్? ఇతర ప్లేయర్లకు ఓ నిబంధనా? అని ప్రశ్నించాడు. ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడి తమ సత్తాను నిరూపించుకోవాలని సూచిస్తున్న సెలెక్షన్ కమిటీ.. విరాట్ కోహ్లీ విషయంలో ఇలా ఎందుకు చేయలేదని ప్రశ్నించాడు.
విరాట్ కోహ్లీ 2020-2022 వరకు పేలవ ఫామ్తో ఇబ్బంది పడ్డాడు. ఆడపా దడపా పరుగులు చేసినా భారీ స్కోర్లు నమోదు చేయలేకపోయాడు. ఈ దశలోనే అతను మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని పూర్తిగా బ్యాటింగ్పై ఫోకస్ పెట్టాడు. తద్వారా తన కెరీర్ను పొడిగించుకోవాలని భావించాడు. ఆసియాకప్ 2022లో అఫ్గానిస్థాన్పై సెంచరీ బాది మళ్లీ ఫామ్ అందుకున్నాడు. అప్పటి మళ్లీ వెనక్కి చూడకుండా పరుగుల మోత మోగిస్తున్నాడు.

తాజాగా ఓ జాతీయ ఛానెల్ ఇంటరాక్షన్లో పాల్గొన్న సయ్యద్ కిర్మాణి 2022లో పేలవ ఫామ్తో తడబడి విరాట్ కోహ్లీని ఎందుకు జట్టు నుంచి తప్పించలేదని ప్రశ్నించాడు. నిలకడలేమి ఫామ్తో ఇబ్బంది పడిన అతన్ని జట్టు నుంచి తప్పించి.. దేశవాళీ క్రికెట్ ఆడాలని ఆదేశించాల్సిందన్నాడు.
'ఈ తరం క్రికెట్లో తీవ్ర పోటీ నెలకొంది. ఎంత సీనియర్ ఆటగాడైనా.. అనుభవం ఉన్నా.. కొన్ని ఇన్నింగ్స్ల్లో విఫలమైతే సెలెక్షన్ కమిటీ జట్టు నుంచి తప్పిస్తోంది. దేశవాళీ క్రికెట్ ఆడి.. ఫామ్ నిరూపించుకోవాలని ఆదేశిస్తోంది. అప్పుడు జట్టులోకి తీసుకోవాలో లేదో నిర్ణయం తీసుకుంటామని చెబుతుంది. అయితే ఇదే రూల్ను రెండేళ్ల క్రితం విరాట్ కోహ్లీకి ఎందుకు వర్తింప చేయలేదని మాత్రం ఎవరూ అడగవద్దు.'అని సయ్యద్ కిర్మాణి వ్యంగ్యస్త్రాలు సంధించాడు.
టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. వన్డే, టెస్ట్ ఫార్మాట్లో మాత్రం కొనసాగుతానని, కుర్రాళ్లకు అవకాశం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2024 లీగ్ దశలో దారుణంగా విఫలమైన కోహ్లీ.. కీలక ఫైనల్లో మాత్రం( 59 బంతుల్లో 76) అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీని అనుసరిస్తూ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు కూడా అంతర్జాతీయ టీ20లకు గుడ్బై చెప్పారు.